బాదం అమ్మకాలతో ఉగ్రవాద నిధులు: నియంత్రణ రేఖ వెంబడి సరికొత్త వ్యాపారం
జమ్ముకశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న వాణిజ్యంలో ఇటీవల 'కాలిఫోర్నియా బాదం' వాటా పెరగడం వెనుక ఉగ్రవాద నిధుల కోణం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గుర్తించింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న వాణిజ్యంలో ఇటీవల 'కాలిఫోర్నియా బాదం' వాటా పెరగడం వెనుక ఉగ్రవాద నిధుల కోణం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గుర్తించింది.
ఈ వ్యాపారం ద్వారా వస్తున్న డబ్బు జమ్ముకశ్మీర్ లోని ఉగ్రవాదులకు చేరుతోందని, ఉగ్రవాద నిధులకు దీనిని ఒక వనరుగా వాడుకుంటున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వ్యాపారులపై జరిపిన సోదాలలో ఈ విషయం నిర్ధారణ అయిందని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
గతంలో సరిహద్దు దాటి నిర్వహించే వాణిజ్యంలో వస్త్రాలు, చున్నీలు ఉండేవి. వ్యాపారులు వస్తు మార్పిడి పద్ధతిలో తమ ఉత్పత్తులను మార్చుకునేవారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూడా కాలిఫోర్నియా బాదం పండిస్తున్నట్లు, దాని నుంచి వచ్చే డబ్బు అక్కడి ఉగ్రవాద సంస్థలకు చేరుతున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు రూ.80 కోట్లు ఉగ్రవాదులకు అందినట్లు తెలిసింది.
దీనిపై కొన్ని నెలల క్రితమే ఎన్ఐఎ అధికారులకు సమాచారం అందడంతో ఉత్తర కశ్మీర్ లోని బారాములా, పూంచ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల వ్యాపారులపై వారు నిఘా వేశారు. అలాగే పశ్చిమ ఆసియా, యూరోప్, దుబాయ్ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వ్యాపారులకు డబ్బు అందుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పసిగట్టింది.
అంతేకాకుండా వ్యాపారుల ముసుగులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకు చొరబడుతున్నారని, వీరు తిరిగి వెళ్ళేప్పుడు తమ వెంట డబ్బు, ఆయుధాలు తీసుకేళుతున్నారని, ఈ విషయంలో ఆయా వ్యాపారులకు సంబంధించిన ట్రక్కు డ్రైవర్లు కూడా ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని కూడా ఎన్ఐఎ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.