బెంగళూరు పోలీసు కమిషనర్ బదిలి: సీఏటీలో ఐపీఎస్ సవాల్, ప్రభుత్వానికి నోటీసులు!
న్యూఢిల్లీ: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్న అలోక్ కుమార్ ను బదిలి చెయ్యడంతో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబునల్ (సీఏటీ)ని ఆశ్రయించారు. తన బదిలిని రద్దు చెయ్యాలని కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సోమవారం సీఏటీకి మనవి చేశారు.
అర్జీ విచారణకు స్వీకరించిన సీఏటీ విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా పని చేస్తున్న అలోక్ కుమార్ ను శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం బదిలి చేసింది. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావ్ ను బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం నియమించింది.
కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో శుక్రవారం సాయంత్రం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా భాస్కర్ రావ్ భాద్యతలు స్వీకరించారు. అలోక్ కుమార్ సమర్పించిన అర్జీని పరిశీలించిన సీఏటీ భాస్కర్ రావ్ నియామకాన్ని రద్దు చెయ్యడానికి నిరాకరించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన భాస్కర్ రావ్ కు సీఏటీ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల క్రితం అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా అలోక్ కుమార్ ను నియమించింది.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా అలోక్ కుమార్ 47 రోజులు పని చేశారు. యడియూరప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అలోక్ కుమార్ ను బదిలి చేసింది. సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లాటరీ స్కాంలో అలోక్ కుమార్ పేరు బయటకు రావడంతో అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు.