ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ అరెస్ట్.. కారణమిదే..?
ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. జుబైర్ u/s 153A/295A IPC నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తునకు పిలిచామని పోలీసులు వివరించారు. తగిన సాక్ష్యాలు ఉన్నందున అరెస్టు చేశామని తెలిపారు. జుబైర్ అరెస్ట్ను ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి జుబైర్ను దిల్లీ పోలీసులు ప్రశ్నించడానికి పిలిచారు. ఈ కేసు విషయంలో ఎలాంటి అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆల్ట్న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు.
జుబైర్ వేరే ఎఫ్ఐఆర్లలో అరెస్టు చేశారని.. ఆయా సెక్షన్ల పరిధిలో ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అభ్యర్థించినా తమకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు అని సిన్హా ట్వీట్ చేశారు. బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలోనే అత్యుత్తమ జర్నలిస్టులలో ఒకరైన మహమ్మద్ జుబైర్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా.. అధికారులను ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఇలాంటి వాళ్లపై కాదని డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. జుబైర్ను ఢిల్లీలో గల బురారీ డ్యుటీ మేజిస్ట్రేట్ నివాసం వద్ద మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. తర్వాత ఒకరోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.