‘నిన్నేమైనా రేప్ చేయబోతున్నానా?’.. మహిళా రైలుబోగీలో యువకుడి హల్చల్
ఓ యువకుడు మహిళా రైలుబోగీలోకి ఎక్కడమే కాకుండా, అందులో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన ఇది.
ముంబయి : ఓ యువకుడు మహిళా రైలుబోగీలోకి ఎక్కడమే కాకుండా, అందులో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన ఇది. ముంబయిలోని సీఎస్టీ నుంచి కాసర వెళ్లే లోకల్ రైలులో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
డోంబివలికి చెందిన దేవేంద్ర ఘాస్(24) అనే 24 ఏళ్ల యువకుడు పీఎస్టీ రైల్వేస్టేషనులో లోకల్ రైలు మహిళా బోగీలోకి ఎక్కాడు. మహిళల పక్కన కూర్చొని కాళ్లు ఊపుతూ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించాడు.
అతడి చర్యలతో కోపోద్రిక్తులై మహిళలు అతడిని మహిళా బోగీ నుంచి దిగిపోవాలని హెచ్చరించారు. దీంతో రెచ్చిపోయిన దేవేంద్ర మహిళా బోగి నుంచి దిగకుండా ''నేనేమైనా నిన్ను రేప్ చేయబోతున్నానా?''అంటూ ఓ మహిళను ప్రశ్నించాడు.
ఇక లాభం లేదనుకున్న మహిళా ప్రయాణికులు రైల్వే హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి అతడిపై ఫిర్యాదు చేశారు. మహిళా బోగీలో ఎక్కడంతోపాటు తమ పట్ల అనుచితంగా వ్యవహరించిన దేవేంద్రను వారే పట్టుకొని థానే రైల్వేస్టేషనులో రైల్వే పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు రైల్వే యాక్టు 1989 సెక్షన్ 145, సెక్షన్ 162 ల కింద కేసు నమోదు చేసి దేవేంద్రను అరెస్టు చేశారు.