అయ్య బాబోయ్.. రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసారుగా..! సిగ్గులు వలకబోస్తున్న పోలింగ్ అధికారి రీనా
లక్నో/హైదరాబాద్ : ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అధికారి రీనా ద్వివేది తన వల్ల పోలింగ్ శాతం పెరిగిందనే వాదనను తోసిపుచ్చారు. లక్నోలో ప్రజా పన్నుల విభాగంలో పనిచేస్తున్న రీనా.. ఐదో విడత పోలింగ్ విధులకు ఈవీఎం బాక్స్ను చేతిలో పెట్టుకొని వెళ్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె నృత్యం చేస్తున్న కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే దీనిపై రీనా ద్వివేది స్పందిస్తూ.. నేనేమీ సెలబ్రిటీని కాదు సాధారణ మహిళనే. గతంలో రెండుసార్లు ఎన్నికల విధులకు హాజరయ్యాను. ఎంతో ఉత్సాహంగా పనిచేశాను. అప్పుడు కూడా నా ఫొటో వాట్సాప్లో వచ్చింది. కానీ, ఇప్పట్లా.. సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కాలేదు. అయితే, ఒక పోలింగ్ కేంద్రంలో ఎంత ఓటింగ్ నమోదవుతుందనేది.. అక్కడి ప్రజల్లో ఉన్న చైతన్యంపైనే ఆధారపడి ఉంటుంది. అంతేగానీ పసుపు రంగు చీరనో.. నీలిరంగు చీరనో కట్టుకొని వస్తే ఓటింగ్ పెరగదు. నేను పనిచేసిన పోలింగ్ కేంద్రంలో దాదాపు 70శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.