కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో అమరావతి మహిళా జేఏసీ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చేందుకు స్థానిక రైతులు, మహిళా జేఏసీ ససేమిరా అంగీకరించడం లేదు. తమ శక్తి మేరకు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రాజధాని కోసం రైతుల నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటు మహిళా జేఏసీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజధాని మార్పు గురించి చర్చించారు.
అమరావతి రాజధానిని కొనసాగించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు. అమరావతి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తోన్న తీరును కిషన్ రెడ్డికి వివరించారు. అమరావతి రాజధానిని కొనసాగించాలని విన్నవించామని తెలిపారు. అమరాతి రైతులకు అన్యాయం చేయొద్దని తెలిపామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు విన్నవించామని.. వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
అమరావతి రైతులకు అన్యాయం జరగనీయమని కిషన్ రెడ్డి తెలిపారని చెప్పారు. అఫిడవిట్ల గురించి హోంశాఖ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. రాజధానిని మార్చొద్దని ఢిల్లీ వెళ్లిన జేఏసీ మహిళా నేతలు మూడోరోజు కిషన్ రెడ్డిని కలిశారు.
మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. తమ సమస్యను విన్నవించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే నిన్న ఢిల్లీ వచ్చిన సీఎం జగన్.. హోంశాఖ మంత్రి అమిత్ షాతో వివిధ అంశాలపై 50 నిమిషాల పాటు చర్చించిన సంగతి తెలిసిందే. జేఏసీ నేతలు ఢిల్లీలో మకాం వేయగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఎవరీ ప్రయత్నాలు వారు చేస్తున్నట్టు అర్థమవుతోంది.