అమరీందర్ కొత్త పార్టీ -బీజేపీతో పొత్తుకు సిద్దం : రైతు చట్టాలను ఉపసంహరిస్తే..!!
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కీలక నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. 2022లో జరుగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని..కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటే పొత్తుతో ముందుకు వెళ్లటానికి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.
బీజేపీతో పాటుగా రైతుల సమస్యలపై పోరాడుతున్న శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే అమరీందర్ రెండు సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధుతో తలెత్తిన విభేదాల కారణంగా గత నెలలో అమరిందర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన కేబినెట్ లోని మంత్రులు..ఎమ్మెల్యేలు సిద్దూ మద్దతుతో తనకు వ్యతిరేకంగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేయటం..వారు వివరణ కోరటం వంటి వాటితో అమరీందర్ అప్ సెట్ అయ్యారు.
అదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన్ను రాజీనామా చేయాలని సూచించింది. సిద్దూని పంజాబ్ పీసీసీ చీఫ్ గా నియమించిన తరువాత అమరీందర్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం ఎక్కువైందని కెప్టెన్ ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తాను కాంగ్రెస్ లో ఉండలేనని..త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అమరీందర్ స్పష్టం చేసారు. ఇక, అమిత్ షా తో సమావేశంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సైతం సాగింది. అయితే, తాను బీజేపీలో చేరటం లేదని..కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు.
దీనికి అనుగుణంగానే తాజాగా పార్టీ ఏర్పాటు పై అధికారిక ప్రకటన చేసారు. పంజాబ్ లో సిద్దు ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని అమరీందర్ పదే పదే చెబుతున్నారు. ఇక, పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్జిత్ సింగ్ చన్నీ సైతం రాజకీయంగా సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను చెప్పిన వారిని మార్చలేదనే కారణంతో సిద్దూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసారు. అయితే, హైకమాండ్ బుజ్జగింపులు..కొన్ని రాజీ ఫార్ములాలతో సిద్దూ తన రాజీనామా ఉప సంహరించుకున్నారు.
Recommended Video
ఇక, కొద్ది నెలల్లో పంజాబ్ ఎన్నికలు జరగనుండగా..ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎంగా.. పార్టీలో బలమైన నేతగా వ్యవహరించిన అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటు కాంగ్రెస్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, తన పార్టీ విధి విధానాలు..బీజేపీతో పొత్తుకు రైతు చట్టాల తో ముడి పెట్టటం పైన ఇప్పుడు బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.