అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారు: బీజేపీతో కలిసి పోటీకి సిద్ధం
న్యూఢిల్లీ: పంజాబ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అంతేగాక, బీజేపీతో పొత్తు కూడా ఉండనుందని తెలిపారు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం.
తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను, వ్యక్తులను కలుపుకుపోతామని అమరీందర్ సింగ్ తమ అధికార ప్రతినిధి ద్వారా వెల్లడించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో రైతు నిరసనలపై చర్చించామని అమరీందర్ సింగ్ తెలిపారు. త్వరలోనే తాను తన సొంత పార్టీని ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ వెల్లడించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాల కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాళీదళ్.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. కొత్త పార్టీ పెట్టి.. బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అకాళీదళ్, ధిండ్సా, బ్రహ్మపుర లాంటి కూడా కలుపుకుపోయేందుకు సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, అలా చేయకుండా కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కలిసి వెళ్లేందుకే అమరీందర్ సింగ్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయం పంజాబ్ రాజకీయాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. అమరీందర్ సింగ్ బీజేపీతో కలిసి వెళతారని తమకు ముందే తెలుసని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ వ్యాఖ్యానించారు.
‘Hopeful of a seat arrangement with @BJP4India in 2022 Punjab Assembly polls if #FarmersProtest is resolved in farmers’ interest. Also looking at alliance with like-minded parties such as breakaway Akali groups, particularly Dhindsa &
— Raveen Thukral (@RT_Media_Capt) October 19, 2021
Brahmpura factions’: @capt_amarinder 2/3 https://t.co/rkYhk4aE9Y
79 ఏళ్ల అమరీందర్ సింగ్.. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంతేగాక, పంజాబ్ రాష్ట్రంలో కీలక రాజకీయ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అప్పగించడంపై అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న పరిణామాలు, అధిష్టానం తీరుతో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ నియమించింది.
Recommended Video
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ రాష్ట్రానికే కాదు, దేశ భద్రతకు కూడా పెను ప్రమాదమని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. సిద్ధూను ముఖ్యమంత్రిని కాకుండా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు అమరీందర్ సింగ్. దీంతో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజాగా, కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేశారు. అయితే, బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళతానని తెలిపారు.