బస్తీ మే సవాల్: కేజ్రీవాల్ వర్సెస్ అమరీందర్ సింగ్
దమ్ముంటే లంబీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు.
చండీగఢ్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. అమరీందర్ సింగ్ లంబీ స్థానం నుంచి పోటీ చేసి ప్రకాశ్ సింగ్ బాదల్ కు సాయపడుతున్నారంటూ.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
దమ్ముంటే లంబీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని కేజ్రీవాల్ కు అమరీందర్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈసారి ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పార్టీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేరికపై వస్తున్న వ్యాఖ్యలను అమరీందర్ తిప్పికొట్టారు.
సిద్ధూతో ఎలాంటి డీల్ లేదని, తమ పార్టీ ఎవరితోనూ డీల్స్ కుదుర్చుకోదని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. బాదల్ కుటుంబం నుంచి బంధ విముక్తులను చేసేందుకే తాను లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
పదేళ్లుగా పంజాబ్ లో బాదల్ కుటుంబం సాగిస్తున్న దురాగతాలకు చరమగీతం పాడతానని కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, దమ్ముంటే బాదల్ కు పోటీగా లంబీ స్థానం నుంచి తలపడాలని సవాల్ విసిరారు. మాట్లాడే ముందు తన స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన సూచించారు.