పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...
అమృత్సర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు తయారైంది. అయితే పంజాబ్ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చాయి. సీఎం అమరీందర్ నేతృత్వంలో 13 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 8 సీట్లు గెల్చుకుంది. అయితే సిద్దూ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆయనను సాగనంపాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సిద్దూను తొలగించేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం అమరీందర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
పది శాతం సీట్లు రాలేదు.. మరి ప్రతిపక్ష హోదా దక్కేనా?
సిద్దూ తీరుపై అమరీందర్ ఫైర్
పంజాబ్లో 8 సీట్లు గెలుచుకోవడంపై అమరీందర్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సిద్దూ వ్యవహారశైలిపై మాత్రం గుర్రుగా ఉన్నారు. ఆయన పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు, గురు గ్రంథ్ సాహిబ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే తమ పార్టీ మరిన్ని సీట్లు సాధించలేకపోయిందని ఆరోపించారు. అర్బర్ ఏరియాల్లో ముఖ్యంగా భటిండాలో సిద్దూ వ్యాఖ్యల ప్రభావం ఎక్కువగా కనిపించిందని అమరీందర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమకు తాము ప్రమోట్ చేసుకునే హక్కు ఉన్నా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇరువురు నేతల మధ్య కోల్డ్ వార్
వాస్తవానికి సీఎం అమరీందర్, సిద్ధూల మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. టికెట్ల కేటాయింపు సమయంలో అది తారాస్థాయికి చేరింది. తన భార్య నవ్జ్యోత్ కౌర్కు చండీఘడ్ టికెట్ ఇవ్వకపోవడంపై సిద్దూ సీఎం అమరీందర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంతో 20 రోజుల పాటు పత్తా లేకుండా పోయారు. ఆ తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్లారన్న అంశంపై పార్టీ నేతలకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
సీఎంను విమర్శించిన సిద్ధూ
ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధించాల్సిన సిద్ధూ సీఎంనే టార్గెట్ చేశారు. అమరీందర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2015 పోలీస్ ఫైరింగ్కు సంబంధించి అప్పటి సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అమరీందర్ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని లేవనెత్తడాన్ని తప్పుబట్టారు. సిద్ధూ నిజమైన కాంగ్రెస్వాది అయితే తన అభ్యంతరాలను ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు వ్యక్తం చేస్తే సరిపోయేదని అన్నారు.
హైకమాండ్ కోర్టులో బంతి
నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని అమరీందర్ ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. నిజానికి ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ను సిద్ధూ కౌగిలించుకోవడంపై తదనంతర పరిణామాలపై పార్టీ హైకమాండ్ కూడా సిద్ధూపై కోపంతో ఉంది. ఈ నేపథ్యంలో అమరీందర్ ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.