ఆశ్చర్యం, చైనా శక్తి ముందు సుష్మా స్వరాజ్ తలొంచారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: డొక్లామ్ విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తలొంచిన తీరు ఆశ్చర్యం అంటూ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం ఎద్దేవా చేశారు. భారత్, చైనా మధ్య డొక్లామ్ వివాదం గత ఏడాదే సద్దుమణిగిందని, అందులో తాజాగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని సుష్మా స్వరాజ్ బుధవారం లోకసభలో అన్నారు.
సుష్మ ప్రకటనపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా శక్తి ముందు సుష్మా తలొగ్గడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఈ మేరకు ఆయన నేడు ట్వీట్ చేశారు.
డొక్లామ్ అంశంపై సుష్మ బుధవారం లోకసభలో మాట్లాడుతూ... అంగుళం భూమి కూడా కోల్పోకుండా దౌత్యపరమైన చర్చలతోనే డొక్లామ్ వివాదాన్ని పరిష్కరించామని, ఇప్పుడు అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని, చిన్న మార్పు కూడా జరగలేదన్నారు. 2017 ఆగస్ట్లోనే డొక్లామ్ ప్రతిష్టంభన తొలగిపోయిందన్నారు.
సుష్మా లాంటి వ్యక్తి చైనా శక్తి ముందు తనకు తానుగా తలొంచడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, ఆమె వ్యాఖ్యలను బట్టి సరిహద్దుల్లో ఉన్న జవాన్లు మోసపోతున్నారని అర్థమవుతోందని రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు డోక్లామ్లో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించిన చైనా అనే కథనాన్ని కూడా జత చేశారు.