RRR.. ఆన్లైన్ అమ్మకాల మంత్రం.. అమెజాన్ కు 70 లక్షల కుచ్చుటోపి
బెంగళూరు : RRR.. ఆన్లైన్ అమ్మకాల సైట్లు గొప్పగా వల్లించే పాలసీ. వినియోగదారులను ఆకర్షించడానికి జపించే మంత్రం. ఇప్పుడు అదే పాలసీ మంత్రంతో ఆన్లైన్ సైట్లు మోసాలబారిన పడుతున్నాయి. తాజాగా అమెజాన్ ను 70 లక్షల రూపాయల మేర మోసగించారు నలుగురు నిందితులు.
మొదటికే మోసం RRR
రిటర్న్, రీఫండ్, రీప్లేస్మెంట్.. ఈ మంత్రంతోనే ఆన్లైన్ అమ్మకాల జోరు పెరిగింది. కూర్చున్న చోటు నుంచే స్మార్ట్ ఫోన్ల మీద వేళ్లాడిస్తూ కొనుగోళ్లు చేసేస్తున్నారు జనాలు. అయితే RRR పాలసీ కొన్ని సందర్భాల్లో ఆ సైట్ల కొంపలు ముంచుతోంది. తాజాగా ఇదే విధానంతో (RRR) అమెజాన్ కు 70 లక్షల రూపాయల కుచ్చుటోపి పెట్టిన విషయం గుట్టురట్టైంది. అయితే అమెజాన్ కు భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తున్న కంపెనీ ఉద్యోగులు నిందితులతో చేతులు కలపడం గమనార్హం.
పనిచేస్తున్న సంస్థకే కన్నం
అమెజాన్ కు థర్డ్ పార్టీగా సేవలందిస్తున్న ఓ సంస్థలో అన్వర్, శివ నాయక్ అసిస్టెంట్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు రవికుమార్, సోను అనే మరో ఇద్దరితో కలిసి అమెజాన్ ను మోసం చేయాలని ప్లాన్ వేశారు. అమెజాన్ విధివిధానాల్లో ఒకటైన రిటర్న్, రీఫండ్, రీప్లేస్మెంట్ ఆధారంగా భారీ మోసానికి తెగబడ్డారు. రవికుమార్, సోను కొనుగోలుదారులుగా వ్యవహరించి వివిధ రకాల వస్తువులు ఆర్డర్ చేసేవారు. తీరా అవి వచ్చాక.. అందులో నుంచి వస్తువులను తీసుకుని వాటి స్థానంలో డూప్లికేట్ ప్రొడక్స్ట్ పెట్టి రిటర్న్ పాలసీ కింద వెనక్కి పంపించేవారు.
854 వస్తువులు.. 70 లక్షలు..!
అమెజాన్ కు థర్డ్ పార్టీగా వ్యవహరిస్తున్న కంపెనీలో వీరి ముఠా వ్యక్తులైన అన్వర్, శివనాయక్ వాటిని అప్రూవ్ చేసి అమౌంట్ వాపసు చేసేలా వ్యవహరించేవారు. అయితే కంపెనీ ఉన్నతోద్యోగులు క్రాస్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీరి గుట్టు రట్టైంది. ఈ నలుగురూ కలిసి 854 వస్తువులు అమెజాన్ కు రిటర్న్ చేసినట్లు తేలింది. వీటి విలువ మొత్తం 69 లక్షల 61 వేల 939 రూపాయలు. ఈమేరకు కోరమాంగళ పీఎస్ లో ఫిర్యాదు అందింది. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.