అయ్యబాబోయ్: ఆరు రోజుల్లో రూ.19 వేల కోట్లే: మార్కెట్ ను కొల్లగొట్టిన అమేజాన్, ఫ్లిప్ కార్ట్
న్యూఢిల్లీ: ఆరు రోజులు. సరిగ్గా ఆరు రోజుల వ్యవధిలో 19 వేల కోట్ల రూపాయల బిజినెస్. ఎక్కడో కాదు.. మనదేశంలోనే. 19 వేల రూపాయల లావాదేవీలంటే మాటలు కాదు. అదీ ఇంత తక్కువ వ్యవధిలో చోటు చేసుకోవడం దేశీయ మార్కెట్ వర్గాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. టాప్ ఇకామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ ఈ ఘనతను సాధించాయట. దసరా, దీపావళి పండుగ సీజన్లను దృష్టిలోో పెట్టుకుని ఈ రెండు సంస్థలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని రకాల వస్తువుల పైనా డిస్కౌంట్లను ప్రకటించాయి. ఫలితంగా- దేశీయ మార్కెట్ ను కొల్లగొట్టేశాయి.
90 శాతా వాటా ఈ రెండు సంస్థలదే
దసరా, దీపావళి సీజన్ల సందర్భంగా అమేజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు భారీ డిస్కౌంట్లకు తెర తీశాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాలకు తొలి ఆరు రోజుల్లో అంటే- కిందటి నెల 29 నుంచి ఈ నెల 4 వరకు 19 వేల కోట్ల రూపాయల స్థూల విక్రయాలు నమోదయ్యాయని బెంగళూరుకు చెందిన రెడ్ సీర్ కన్సల్టెన్సీ అనే సంస్థ వెల్లడించింది. ప్రస్తుత పండగ సీజన్ లో దేశీయ మార్కెట్ లో 90 శాతం వాటాను ఈ రెండు సంస్థలు కొల్లగొట్టాయని పేర్కొంది. ప్రస్తుత పండుగ సీజన్ ముగిసే సరికి కనీసం 39 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించిందా సంస్థ.
గత సీజన్ తో పోల్చుకుంటే 30 శాతం..
అమేజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు గత ఏడాది దసరా, దీపావళి సీజన్ లో నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాలతో పోల్చుకుంటే ఈ సారి 30 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంది. మింట్రా, జబాంగ్ లు సైతం తీసిపోలేదని 63 శాతం మేర గ్రాస్ మర్కంటైజ్డ్ వేల్యూ (జీఎంవీ)లను నమోదు చేశాయని స్పష్టం చేసింది. ఆన్ లైన్ సంస్థల వల్ల దేశీయంగా ఉన్న సాధారణ మార్కెట్ కుదేలయ్యే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడింది. సంప్రదాయ బద్ధమైన వ్యాపార లాావాదేవీలపై ఆన్ లైన్ మార్కెటింగ్ తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంచనా వేసింది.
ఆఫర్ల వల్లే..
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సహా అన్ని రకాల వస్తువుల ధరల్లో భారీ తగ్గింపు, ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రభావం మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకోవడం వల్లే కనీవినీ ఎరుగని రీతలో అతి స్వల్ప కాలంలో 19 వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదయ్యాయని స్పష్టమైంది. ఈ అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్ల వాటా ఒక్కటే 60 శాతం ఉన్నట్లు తేలింది. ఎలక్ట్రానిక్, ఇతర గృహోపకర వస్తువుల కొనుగోళ్లకూ డిమాండ్ ఉన్నప్పటికీ.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల హవా కొనసాగిందని రెడ్ సీర్ పేర్కొంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించిన వస్తువులకూ గతంలో కంటే ఈ సారి డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిపింది.