మారిన అమెజాన్ రీఫండ్ పాలసీ: ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
బెంగుళూరు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్టాప్, ట్యాబ్లెట్, డెస్క్టాప్పీసీ, మోనిటర్, కెమేరా, కెమేరా లెన్సులు ఏవైనా మే 11 తర్వాత కొన్నారా? వస్తువు నచ్చకుంటే వెనక్కు తిరిగి ఇచ్చేసి, మీరు చెల్లించిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకునే సదుపాయం ఇక లేదు.
ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై రిఫండ్ పాలసీని మారుస్తూ, అమెజాన్ ఇండియా తాజాగా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. పైన పేర్కొన్న ఉత్పత్తులు రీఫండ్కు అర్హమైనవి కావని పేర్కొంది. అంతేకాదు ఆయా వస్తువులకు రీప్లేస్మెంట్ మాత్రమే వర్తిస్తుందని పేర్కంది.
అది కూడా మీకు అందిన వస్తువు నాణ్యతాలోపం ఉందనిగానీ, లేదా డ్యామేజ్ అయిన వస్తువు చేతికందిందని గానీ నిరూపించగలిగితేనే ఉచితంగా రీప్లేస్మెంట్ లభిస్తుంది. ఈ మేరకు అమెజాన్ తన వెబ్సైట్లో ఓ ప్రకటనను ఉంచింది. ఈ నిబంధన మే 11 నుంచి అమల్లోకి వచ్చింది.
దీంతో ఏదైనా వస్తువు కోనుగోలు చేస్తే, అందులో లోపాలు ఉంటే కేవలం 10 రోజుల్లోనే ఫిర్యాదు చేయాలి. ఆపై ఫిర్యాదు చేసినా వస్తువును వెనక్కు తీసుకోకరు సరికదా? రీప్లేస్మెంట్ సౌకర్యం కూడా లభించదని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది. మిగిలిన ఉత్పత్తులకు రిఫండ్ యథావిధిగా వర్తిస్తుందని చెప్పింది.
ఇదిలా ఉంటే ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్లు దాదాపు ఇదే తరహా రీఫండ్ పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సంస్థల రీఫండ్ పాలసీలను సమీక్షించిన తర్వాతనే, తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెజాన్ పేర్కొంది. గతంలో రీఫండ్ పాలసీ కేవలం మొబైల్స్కు మాత్రమే వర్తించేది. తాజాగా పైన పేర్కొన్న ఉత్పత్తులను జాబితాలోకి చేర్చింది.