చైనాకు అమెజాన్ షాక్- ఇక చెన్నెలోనే స్మార్ట్ డివైజ్ల తయారీ -మేకిన్ ఇండియాకు ఊతం
కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల చేస్తున్న ఆత్మనిర్భర్ ప్యాకేజీ, మేకిన్ ఇండియా కార్యక్రమాల ప్రయోజనం క్రమంగా కనిపిస్తోంది. ఇప్పటికే చైనాతో పాటు పలు విదేశీ సంస్ధల ఉత్పత్తులను దేశం నుంచి తరిమేసిన కేంద్రం.. వాటి స్ధానంలో స్వదేశీ సంస్ధలకు పెద్దపీట వేస్తోంది. అలాగే విదేశీ సంస్ధలు కూడా భారత్లో తయారు చేసే ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తోంది. దీంతో ఇప్పుడు అమెరికాకు చెందిన అమెజాన్ సంస్ద కూడా భారత్లోనే తమ స్మార్ట్ పరికరాల తయారీ యూనిట్ పెట్టుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటివరకూ పరికరాల తయారీ విషయంలో చైనాపై ఆధారపడుతున్న అమెజాన్ ఇండియా త్వరలో.. చెన్నైలో తమ తయారీ యూనిట్ ప్రారంభిస్తామని వెల్లడించింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. చెన్నైలో ఫాక్స్ కాన్ సంస్ద సబ్సిడరీగా ఉన్న క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీ సంస్ధ సాయంతో అమెజాన్ ఫైర్ స్టిక్లను తయారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యధికంగా ఆమ్ముడవుతున్న అమెజాన్ ఫైర్స్టిక్లను చైనాతో పాటు తైవాన్ నుంచి తెప్పిస్తోంది. కానీ ఈ ఏడాది చివర్లో చెన్నైలోనే ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడే వాటిని తయారు చేస్తామని అమెజాన్ చెబుతోంది.
అమెజాన్ ఇండియా ప్రస్తుతం స్మార్ట్టీవీల స్ట్రీమింగ్ కోసం వాడుతున్న ఫైర్ స్టిక్లతో పాటు ఈ బుక్ కిండిల్ డివైజెస్ను, ఎకో పేరుతో స్మార్ట్ స్పీకర్లను కూడా తయారు చేస్తోంది. అయితే ఇవి చైనాతో పాటు తైవాన్ నుంచి తెప్పించిన పరికరాలతో తయారవుతున్నాయి. కానీ భారత్ తీసుకున్న మేకిన్ ఇండియా విధానం ప్రకారం ఇకపై చైనా మార్కెట్ నుంచి వాటిని తెప్పించడం కష్టంగా మారబోతోంది. అందుకే వీటిని చెన్నైలోనే తయారు చేయాలని అమెజాన్ ఇండియా నిర్ణయించింది.