అంబానీ దెబ్బకు.. ఎయిర్టెల్, ఐడియా రూ.3వేల కోట్లు ఢమాల్..
రిలయన్స్ జియో ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి వరకు పొడగిస్తున్నట్టుగా ప్రకటించడంతో.. ఎయిర్ టెల్ మరియు ఐడియా సెల్యూలర్ రూ.3వేల కోట్ల మార్కెట్ విలువను నష్టపోయాయి.
ముంబై : రిలయన్స్ జియో ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి వరకు పొడగిస్తున్నట్టుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించగానే.. ఇతర టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. ఈ ప్రకటనతో రిలయన్స్ 1శాతం మేర లాభపడగా.. మిగతా టెలికాం స్టాక్స్ అన్ని ఒక్కసారిగా పతనమయ్యాయి.
దీంతో టెలికాం దిగ్గజాలు తమ మార్కెట్ విలువను దాదాపు రూ.3వేల కోట్లు మేర నష్టపోయాయి. ఇందులో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ 1.66శాతం, ఐడియా సెల్యూలర్ 5.93శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5.05శాతం మేర నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నాం 1.30గం.ల సమయంలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్ టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ఆరంభం కాగానే రూ.318కి పడిపోవడం గమనార్హం. దీంతో ఒక్క ఎయిర్ టెల్ సంస్థకే రూ.2,276కోట్ల మార్కెట్ నష్టం జరిగింది.
అదే సమయానికి ఐడియా సెల్యూలర్ మార్కెట్ షేర్ విలువ రూ.76.60గా ట్రేడ్ కాగా.. ముఖేష్ స్పీచ్ ప్రారంభమవగానే రూ.74.20కి పడిపోయింది. దీంతో ఐడియా మార్కెట్ విలువలో రూ.720కోట్ల మేర నష్టం వాటిల్లింది. దేశీ మార్కెట్లో ఎయిర్ టెల్, ఐడియాలే ఎక్కువగా నష్టపోయినట్టు టెలికాం నిపుణులు చెబుతున్నారు. జియో సంచలనం ఎంట్రీ ఇచ్చిన రోజే ఎయిర్ టెల్, ఐడియా వంటి షేర్ మార్కెట్ విలువ రూ.16వేలు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.