భగ్గుమన్న అసంతృప్తి: ఎమ్మెల్యేగా అంబరీష్ రాజీనామా
బెంగళూరు: మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అసంతృప్తి భగ్గుమంటోంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఎమ్మెల్యే ఎంహెచ్ అంబరీష్ సోమవారంనాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డికి పంపించారు.
అయితే అంబరీష్ వ్యక్తిగతంగా కాకుండా తన సహాయకుడితో రాజీనామా లేఖ పంపినందున ఆ రాజీనామాను ఆయన తిరస్కరించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం చేపట్టిన మంత్రవర్గ పునర్వవస్థీకరణలో భాగంగా అంబరీష్తో పాటు 14 మంది మంత్రులను పదవుల నుంచి తొలగించి 13 మందికి చోటు కల్పించారు.
పనితీరు సమర్ధవంతంగా లేకపోవడం, వివాదాల్లో చిక్కుకోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని సిద్ధరామయ్య ఈ మార్పులు చేర్పులు చేపట్టారు. సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్వాసనకు గురైన మంత్రుల మద్దతుదారులు ఆందోళనలకు సైతం దిగారు. అంబరీష్ మద్దతుదారులు మాండ్యా జిల్లాలోని బెంగళూరు-మైసూరు హైవేను దిగ్బంధం చేశారు.
మంత్రి పదవి: నటుడు అంబరీశ్కు ఉద్వాసన, కన్నడిగుల ఆగ్రహాం
ఇదిలావుంటే, అంబరీష్ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు జనపర క్రియ వేదికే, మరిన్ని సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో అంబరీష్ రైతులు, సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలమయ్యారని వేదికే ఓ ప్రకటనలో విమర్శించింది.