అమ్మాయికి ముద్దిస్తూ..: మీడియాపై అంబరీష్ చిందులు
హైదరాబాద్: ఇటీవల తాను ఓ అమ్మాయిని చుంబిస్తూ ఫోటోలు ప్రచురితం కావడంపై కర్నాటక హౌజింగ్ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం నాడు మండిపడ్డారు. ఇది చాలా దారుణమని, కూతుళ్లను, మనవరాళ్ల పట్ల ఆప్యాయత చూపించడాన్ని కూడా ఫోటోలు తీసి ప్రచురించడం సరికాదన్నారు.
తాను ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా మీడియా వక్రీకరిస్తోందన్నారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా మీడియా ప్రవర్తన ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తనకు వ్యక్తిగత జీవితం ఉండదా? నా బిడ్డలు, మనవళ్లకు ముద్దిచ్చినా వివరీతార్థాలు తీస్తారా? అని ప్రశ్నించారు.
మంచి విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు సూచించారు. ఇప్పుడు తాను మాట్లాడిన మాటలు మీ చానళ్లు, పత్రికల్లో వస్తాయా? లేదా? అంటూ విలేకరులను నిలదీశారు. అసలు మీతో మాట్లాడాలని లేదని మీడియాతో వ్యాఖ్యానించారు.
కాగా, అంబరీష్ ఓ అమ్మాయిని చుంబిస్తున్న చిత్రం వాట్సప్లో సర్క్యులేట్ కావడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అంబరీష్ సెల్లో తన నృత్యాలకు సంబంధించిన ఫొటోలు చూస్తూ ఇటీవల సభలో కాలక్షేపం చేశారనే ఆరోపణలు కూడా గత బుధవారంనాడు వచ్చాయి. దీంతో అప్పుడు మూడవ రోజైన గురువారం కూడా శాసనసభలో మొబైల్ వివాదం ఊపేసింది.
ఇటీవల శాసన సభలో మొదటిరోజు చెరుకు మద్దతు ధరపై చర్చ జరగుతుండగా ప్రభు చవాన్ సెల్లో ఫోటోలూ చూస్తూ కాలం గడిపారంటూ వచ్చిన ఆరోపణలతో గురువారం మధ్యాహ్నం నుంచి వివాదం ప్రారంభమైంది.
గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న తమ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్లో తాను చేసిన నాట్యాన్ని సెల్ఫోన్లో చూపిస్తూ కాలం గడిపారని ఆరోపణలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, వాట్పప్లో హల్ చల్ చేస్తున్న అంబరీష్ చిత్రం ఇటీవల బెంగళూరులోని ఓ బార్లోతీసినవని కొందరు, చాలా నెలల క్రితం ఆయన సొంత జిల్లా మాండ్యాలోని ఓ బార్లో తీసినవని మరికొందరు వాదిస్తున్నారు.
అంబరీష్ సభలో సెల్ఫోన్ తిలకించడం నిజమైతే తాను ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడే చెప్పారు. అంబరీష్ ఎక్కడ చూశాడు, ఏం చూశాడు అని ఆయన అడిగారు. అంబరీష్ అలా చేసి ఉంటే మరోసారి అలా చేయవద్దని సలహా ఇస్తానని చెప్పారు.