అంబేద్కర్పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డే
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు దేశవిదేశాల్లో ఘనంగా జరిగాయి. భారత్ నలుమూలాలా బాబా సాహెబ్ కు నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అనూహ్య వ్యాఖ్యలు చేశారు. జాతీయ అధికార భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారంటూ సీజేఐ బోబ్డే క్లెయిమ్ చేయడం చర్చనీయాంశమైంది..
షాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలు
నాగపూర్లో కీలక ప్రసంగం
మరో వారంలో సీజేఐ పదవి నుంచి దిగిపోనున్న జస్టిస్ బోబ్డే తన సొంత ఊరు నాగపూర్ లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో కీలక ప్రసంగం చేశారు. నాగపూర్లో గల మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ఇవాళ అంబేద్కర్ జయంతి కూడా కావడంతో రాజ్యాంగ నిర్మాతకు సంబంధించి ఇప్పటిదాకా చర్చ జరగని ఆసక్తికర విషయాలను జస్టిస్ బోబ్డే గుర్తుచేశారు..
అంబేద్కర్ సంస్కృత ప్రతిపాదన
ప్రజలకు కావలసినది ఏమిటో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు బాగా తెలుసునని, రాజకీయ, సాంఘిక సమస్యలను ఆయన బాగా అర్థం చేసుకున్నారని, కాబట్టే అధికారిక జాతీయ భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారని సీజేఐ బోబ్డే చెప్పారు. అరిస్టాటిల్, పర్షియన్ విధానంలోని తర్కం కన్నా మన పూర్వీకులు రాసిన న్యాయశాస్త్రం కొంచెమైనా తక్కువైనది కాదని, మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందడం మానుకోవడానికి, దానిని వదిలిపెట్టడానికి, పట్టించుకోవడం మానేయడానికి తగిన కారణం ఏదీ లేదని సీజేఐ అన్నారు.
భాష మధ్య ఘర్షణ..
''ఈరోజు ఉదయం నేను ఏ భాష గురించి మాట్లాడాలనే విషయంపై సందిగ్ధంలో పడ్డాను. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఇది నాకు గుర్తు చేస్తున్నదేమిటంటే, మాట్లాడేటపుడు ఉపయోగించవలసిన భాష, పని చేసేటపుడు వాడవలసిన భాష మధ్య సంఘర్షణ చాలా పాతదే. సబార్డినేట్ కోర్టుల్లో వాడవలసిన భాష ఏదో చెప్పాలని సుప్రీంకోర్టుకు చాలా వినతులు వస్తూంటాయి. ఈ విషయంపై పరిశీలన జరగడం లేదనేది నా అభిప్రాయం. అయితే అంబేద్కర్ ఈ పార్శ్వాన్ని ముందుగానే ఊహించారు. అందుకే..
మౌల్వీలు కూడా సంతకాలు చేశారు..
సంస్కృతం యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక భాష కావాలని డాక్టర్ అంబేద్కర్ గతంలోనే ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై కొందరు మౌల్వీలు, పండిట్లు, మత పెద్దలు, అంబేద్కర్ సంతకాలు చేశారు.ఉత్తరాదిలో తమిళం అంగీకార యోగ్యం కాదు కాబట్టి, దానిని వ్యతిరేకిస్తారని, అదేవిధంగా హిందీని దక్షిణాధిలో వ్యతిరేకిస్తారని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. సంస్కృతానికి ఉత్తరాది, దక్షిణాదిలలో వ్యతిరేకత ఉండే అవకాశం తక్కువ ఉందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన సంస్కృత ప్రతిపాదన చేశారు, అయితే, దీనిని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారో, లేదో మాత్రం నాకు గుర్తు లేదు'' అని సీజేఐ బోబ్డే అన్నారు.
లా స్కూల్ నర్సరీలాంటిదే..
న్యాయ శాస్త్రాన్ని బోధించే కళాశాల అనేది నర్సరీ వంటిదని, ఇక్కడి నుంచే లీగల్ ప్రొఫెషనల్స్, జడ్జీలు వస్తారని సీజేఐ చెప్పారు. మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ వల్ల అనేక మంది కలలు నిజమవుతాయన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు జాతీయ దృక్పథాన్ని బోధిస్తారన్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చినవారు ఇక్కడ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రాంతీయతత్వం, సంకుచిత భావాలు వంటివేవీ ఇక్కడ లేవన్నారు. లాజిక్ను ఉపయోగించే బ్రిటిష్ వ్యవస్థ నుంచి మన దేశ న్యాయ వ్యవస్థను రూపొందించారని చెప్పారు. లాజిక్కు మూలం అరిస్టాటిల్ అని చెప్పారు. భారత దేశంలో అభివృద్ధి చెందిన న్యాయశాస్త్రం అరిస్టాటిల్, లాజిక్కు సంబంధించిన పర్షియన్ వ్యవస్థకు కొంచెమైనా తక్కువైనది కాదని వివరించారు. మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందకపోవడానికి, దానిని పట్టించుకోకుండా వదిలేయడానికి తగిన కారణమేదీ తనకు కనిపించడం లేదన్నారు. అందుకే ఈ కోర్సును ప్రారంభించారని, ఇది చాలా విశిష్టమైనదని తెలిపారు.
ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ