సీసీబీ కస్టడీకి గాలి జనార్డన్ రెడ్డి శిష్యుడు, బావిలో మొబైల్, సాక్షాలు నాశనం, రూ.వందల కోట్లు చీటింగ్
బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో 57 కేజీల బంగారం ముడుపులు అందుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు ఆలీఖాన్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకుల నుంచి తీసుకున్న 57 కేజీల బంగారం ఆలీఖాన్ ఏం చేశాడు అంటూ సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
సెంట్రల్ జైలు
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఆలీఖాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరిచిన సీసీబీ పోలీసులు అతన్ని విచారణ చెయ్యడానికి 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని మనవి చేశారు. అయితే ఆలీఖాన్ ను 8 రోజుల పాటు విచారణ చెయ్యడానికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
సాక్షాలు నాశనం
బెంగళూరు 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డి జామీను తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆలీఖాన్ ను అరెస్టు చెయ్యడానికి సీసీబీ పోలీసులు వెళ్లిన సమయంలో అతను స్నేహితుడు జయరాం చేతికి మొబైల్ ఇచ్చి బావిలో విసిరివేయించాడని సీసీబీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆలీఖాన్ సాక్షాలు నాశనం చేశాడని సీసీబీ పోలీసులు అంటున్నారు.
అధికారులు బదిలి
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత సీసీబీ విభాగంలోని నలుగురు ఏసీపీలను పై అధికారులు బదిలి చేశారు. సీసీబీ విభాగం ఏసీపీ బాలరాజ్ ఆధ్వర్యంలోని అధికారులు మళ్లీ కొత్తగా విచారణ మొదలు పెట్టారు. ఆలీఖాన్ ను మళ్లీ అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. బావిలో ఉన్న ఆలీఖాన్ మొబైల్ ఫోన్ బయటకు తీసి వాటి వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
రూ. 18 కోట్లు వాపస్
ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకుడు ఫరీద్ బెయిల్ మీద బయట ఉన్నాడని, ఈ సందర్బంలో ఆలీఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినా ఫలితం ఉండదని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్బంలో రూ. 18 కోట్లు తాను తిరిగి చెల్లిస్తానని ఆలీఖాన్ న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాడని సమాచారం. సీసీబీ పోలీసులకు ఆలీఖాన్ ఆస్తులు జప్తు చేసే అధికారం లేదని అతని న్యాయవాదులు అంటున్నారు.
రూ. 950 కోట్లు చీటింగ్ ?
ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులు ప్రజలకు రూ. 950 కోట్లకు పైగా మోసం చేశారని సీసీబీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటీకే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకుల కేసును మరోవైపు సీసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఆంబిడెంట్ నిర్వహకుడు ఫరీద్ ఎంత మొత్తంలో ప్రజలకు మోసం చేశాడు అనే విషం పోలీసుల విచారణలో వెలుగు చూడనుంది.