మంత్రి గారి కాన్వాయ్: 108 నిలిపేశారు (వీడియో)
అహమ్మదాబాద్: మంత్రులను ప్రసన్నం చేసుకోవడం కోసం పోలీసులు నిరుపేదల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారనే సంగతి మరో సారి వెలుగు చూసింది. మంత్రి, అధికారుల కాన్వాయ్ వెళుతుందంటూ ఓ ట్రాఫిక్ సిగ్నల్ లో 108 వాహనం నిలిపివేశారు.
108 వాహనం డ్రైవర్ లోపల అనారోగ్యంతో బాధపడుతున్న రోగి ఉన్నారని సైరన్ వేస్తున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా మూడు సార్లు గెలిచి, ప్రస్తుతం ప్రధాని గా ఉన్న నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్ లోనే ఈ సంఘటన జరిగింది.
అహమ్మదాబాద్ నగరంలో 108 వాహనంలో ఓ రోగిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. ఆ సందర్బంలో సర్కిల్ లోని అన్ని సిగ్నల్స్ లో వాహనాలు నిలిపివేశారు. మంత్రిగారు వస్తున్న రోడ్డు మాత్రం క్లియర్ చేశారు.
అదే సిగ్నల్ లో ఉన్న 108 వాహనం చూసిన ట్రాఫిక్ పోలీసులు మాత్రం దానిని పంపించడానికి నిరాకరించారు. మంత్రి గారి కాన్వాయ్ వెళ్లిన తరువాత తీరికగా వాహనాలు వదిలేశారు. అప్పుడు కూడా 108 వాహనం గురించి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదు.