వాటిపై అమెరికా నిషేధం: వ్యాక్సిన్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకమన్న సీరమ్ సీఈవో అదర్ పూనావాలా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన కీలక ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించడంతో టీకా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసే ప్రక్రియలో ఈ అవరోధాలను తొలగించాల్సి ఉందన్నారు.
ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా నిషేధం విధించాన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు తప్పుబడుతున్నాయి. వ్యాక్సిన్ కు అవసరమైన బ్యాగులు, ఫిల్టర్లతోపాటు పలు కీలకమైన వస్తువులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించిందని, దీంతో భారీ స్థాయిలో నోవావాక్స్ వ్యాక్సిన్ తయారీకి సిద్ధమైనప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని అదర్ పూనావాలా తెలిపారు.
అమెరికా సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు వీలుగా ఇటీవలే అమెరికా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. దీంతో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సమపాళ్లలో అందించాలన్న లక్ష్యానికి ఆటంకం ఏర్పడిందని వివరించారు.
ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ గడిచిన రెండు నెలల్లో భారీ స్థాయిలో వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 51 దేశాలకు సుమారు 9కోట్ల వ్యాక్సిన్ డోసులున పంపించినట్లు వెల్లడించారు. కాగా, అమెరికాలో భారీ స్థాయిలో పంపిణీ చేస్తోన్న ఫైజర్ టీకా కోసమే ఆ దేశం ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఎంతో కీలకమైన సమయంలో ఇలాంటి నిషేధాలు విధించడం సరికాదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణురాలు సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యను సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు.