హౌడీ మోడీతో అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం.. మూడేళ్ల క్రితం ఇదేరోజు సర్జికల్ స్ట్రైక్స్...
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టి, భారత్ వాణిని బలంగా వినిపించిన ప్రధాని నరేంద్రమోడీ స్వదేశం చేరుకున్నారు. ఢిల్లీలో గల పాలం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ వర్కింగ్ ప్రసెడెంట్ జేపీ నడ్డా, బీజేపీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్ షోగా మోడీ బయల్దేరారు. మోడీ వెంట బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు ఉన్నారు.
సంబంధాలు బలోపేతం
తర్వాత ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. తన అమెరికా పర్యటనకు ఓ విశిష్టత ఉందని ప్రధాని మోడీ అన్నారు. 2014 తర్వాత భారత్ పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందన్నారు. హ్యుస్టన్లో నిర్వహించిన హౌడీ మోడీ సభతో అమెరికా భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని మోడీ అన్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా భారత్ గౌరవం పెరిగిందని మోడీ అన్నారు. మూడేళ్ల క్రితం ఇదేరోజున సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని మోడీ అన్నారు. ఆ రోజున తాను నిద్ర కూడా పోలేదని మోడీ గుర్తుచేశారు.
బలంగా వాదనలు
నిన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయమన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం నడుం బిగించామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2025 నాటికి దేశాన్ని టీవీ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తేల్చిచెప్పారు.
సంక్షేమ రాజ్యం
దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధి అని స్పష్టంచేశారు. మేం చేస్తోన్న ప్రయత్నాలు.. ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. 130 కోట్ల ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మోడీ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బుద్ధ విధానం
ప్రపంచశాంతి కోసం పాటుపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తమది యుద్ధ విధానం కాదని తెలిపారు. గత కొంతకాలంగా పాకిస్థాన్తో యుద్ధమేఘాలు కమ్ముకొన్న క్రమంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు శాంతి అంటూ చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. తాము మాత్రం ప్రపంచశాంతి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తమ వాదనను ఐక్యరాజ్యసమితిలో మోడీ బలంగా వినిపించారు.
ఇవే విధానాలు
విశ్వశాంతి కోసం తాము పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తమకు మూడు విధానాలు ముఖ్యమని పేర్కొన్నారు. సమస్త విశ్వం, దేశం, సమాజం కోసం భారతదేశం పాటుపడుతుందని పేర్కొన్నారు. విశ్వ శాంతి కోసం కృషిచేస్తామని, అందరికీ దయభావంతో మెలుగుతామని పేర్కొన్నారు. ప్రజాహితమే తమ కర్తవ్యమని ఉద్ఘాటించారు. 130 కోట్ల మంది ప్రయోజనాల కోసం అహోరాత్రులు కష్టపడుతున్నామని తెలిపారు.
శాంతియే.. కానీ
భారత్ శాంతి కాముక దేశమని, అలాగని తిరగబడితే చూస్తూ ఊరుకోబమని తేల్చిచెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారియిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పు దీనికి నిదర్శమని చెప్పారు. ప్రపంచ దేశాలు పురోగమన దిశలో పయనిస్తున్నాయని చెప్పారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు శాంతి, సామరస్యం ముఖ్యమని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఇదే విషయాన్ని వివేకానంద అమెరికాలో చాలా చోట్ల చెప్పారని గుర్తుచేశారు.