అమెరికా లేడీపై ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్లో గ్యాంగ్ రేప్
మహిళలపై దేశ రాజధాని ఢిల్లీలో అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా, ఓ అమెరికా మహిళపై ఐదుగురు వ్యక్తులు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచార పర్వం ఆగేట్లు లేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ అమెరికన్ టూరిస్టర్పై గ్యాంగ్రేప్ జరిగింది. టూరిస్ట్ గైడ్తో పాటు నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది.
ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూరిస్ట్ వీసాతో తాను మార్చి 2016లో ఇండియాకు వచ్చానని, కొన్నాట్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో చెప్పింది.
ఓ ఏజెన్సీని సంప్రదించగా టూరిస్ట్ గైడ్ను పంపించారని, అతను ఢిల్లీలోని కొన్ని పర్యాటక ప్రాంతాలను చూపించాడని తెలిపింది. తాను రూమ్లో ఒంటరిగా ఉండగా రూట్ ప్లాన్ గురించి మాట్లాడాలని గైడ్ వచ్చాడని, అతను అప్పటికే మద్యం సేవించి ఉన్నాడని ఆ పర్యాటకురాలు చెప్పింది.
అతనితో పాటు మరో నలుగురు గదిలోకి వచ్చి డోర్ లాక్ చేశారని, ఆ తర్వాత తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తనపై అత్యాచారం జరగడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ వెంటనే అమెరికా వెళ్లిపోయింది. ఈ సంఘటన గురించి తాను తన కుటుంబ సభ్యులకు చెప్పలేదని, అయితే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆమె చెప్పింది.
ఆ తర్వాత తాను న్యాయవాదిని, తన మిత్రులను సంప్రదించానని, ఇండియాలోని ఎన్జీవోను సంప్రదించాల్సిందిగా వారు సలహా ఇచ్చారని, ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తనకు ఎన్జీవో ప్రతినిధులు సలహా ఇచ్చారని ఆమె వివరించింది.