బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములకు బంపర్ ఆఫర్: డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం. దేశంలో ఇద్దరే!
బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి ఎంపీ శ్రీరాములు (బీజేపీ)ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇచ్చి శాంతి చర్చలు జరపడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే ఆచారాన్ని పాటిస్తూ ఈనెల 7,8 తేదీల్లో వైట్ హౌస్ లో విందు ఇస్తున్నారు.
శ్రీరాములకు ఆహ్వానం.
ఈనెల 7, 8వ తేదీల్లో అమెరాకిలోని వైట్ హౌస్ లో డోనాల్డ్ ట్రంప్ ఇస్తున్న విందుకు హాజరు కావాలని బళ్లారీ ఎంపీ శ్రీరాములుకు ఆదేశ అధికారులు ఆహ్వానం పంపించారు. ఇప్పటికే శ్రీరాములు చేతికి ఆహ్వానం అందడంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు
మహారాష్ట్ర సీఎం
వైట్ హౌస్ లో నిర్వహిస్తున్న విందుకు హాజారు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పంపించారు. తప్పకుండా విందుకు హాజరుకావాలని డోనాల్డ్ ట్రంప్ తరపున ఆయన ప్రతినిధులు దేవేంద్ర ఫడ్నవీస్ కు మనవి చేశారు.
దేశం నుంచి ఇద్దరే
భారతదేశం నుంచి ఇద్దరిని మాత్రమే డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో నిర్వహిస్తున్న విందుకు ఆహ్వానించారు. వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు ఉన్నారు. ఆ ఇద్దరూ బీజేపీ నేతలు కావడం కొసమెరుపు.
సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని సంఘటన అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని ఎంపీ శ్రీరాములు చెప్పారు.
బీజేపీ గ్రీన్ సిగ్నల్ ?
బడ్జెట్ సమావేశాల చర్చ జరుగుతున్న సందర్బంగా లోక్ సభలో ఎంపీలు అందరూ ఉండాలని బీజేపీ విప్ జారీ చేసిందని శ్రీరాములు చెప్పారు. అయితే తాను ఇప్పటికే వీసా తీసుకున్నానని, అధిష్టానం అనుమతి ఇస్తే తప్పకుండా అమెరికా వెళ్లి డోనాల్డ్ ట్రంప్ ను కలుస్తానని శ్రీరాములు మీడియాకు చెప్పారు. బడ్జెట్ సమావేశాల చర్చ జరుగుతున్న సందర్బంగా బీజేపీ అధిష్టానం అమెరికా వెళ్లడానికి ఎంపీ శ్రీరాములుకు అనుమతి ఇస్తుందో ? లేదో ? వేచి చూడాలి.