అండమాన్లో దారుణం: అమెరికా జాతీయుడిని అతి కిరాతకంగా చంపిన గిరిజన తెగ
అండమాన్ నికోబార్ దీవుల్లో దారుణం జరిగింది. అక్కడి గిరిజనుల పై పరిశోధన చేసేందుకు వచ్చిన ఓ అమెరికా జాతీయుడిని గిరిజనులు అతి క్రూరంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిందూ మహాసముద్రంలో చిట్టచివరిగా ఉన్న దీవిలో నివసిస్తున్న గిరిజనుల జీవన వ్యవహార శైలి గురించి తెలుసుకునేందుకు వెళ్లిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తిని బాణాలు, ఈటెలు విసిరి చంపేశారు ఆ దీవి గిరిజనులు.
నాగరిక సమాజం తెలియని గిరిజనులు
హిందూ మహాసముద్రంలోని ఉత్తర్ సెంటినెల్ దీవిలో కొందరు గిరిజనులు నివసిస్తూ ఉంటారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. నాగరికత సమాజం అంటే ఏమిటో తెలియదు. వారు దీవిపై ఉన్న అడవిలోని చెట్లు చేమలు, పక్షులు, ఇతరత్ర జంతువులను వేటాడి చంపి తింటూ జీవనం సాగిస్తూ ఉంటారు. వారి గురించి లోతైన అంశాలు తెలుసుకుందామని అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ దీవిని వెత్తుక్కుంటూ వెళ్లాడు. అక్కడి వరకు చేరేందుకు కొందరు మత్స్యకారులు తనకు సహాయం చేశారు. ఒక దగ్గరికి వెళ్లి మత్స్యకారులు జాన్ను వదిలారు.
ముందురోజు చాలా బాగా మాట్లాడిన గిరజనులు మర్నాడు చంపేశారు
ఇక గిరిజనులను కలిశాడు. వారితో మాట కలిపాడు. వారి జీవన విధానాలు గురించి అడిగి తెలుసుకున్నాడు. వారు ఎలా బతుకుతారు అనేది పూసగుచ్చినట్లు చెప్పారు. నవంబర్ 15న తాను గిరిజనులతో గడిపిన క్షణాల గురించి తన డైరీలో రాసుకున్నాడు జాన్. ఆ తర్వాత తిరిగి క్షేమంగా మత్స్యకారుల ఉన్న చోటుకు ఈదుకుంటూ చేరుకున్నాడు. మర్నాడు ఉదయం అంటే నవంబర్ 16న జాన్ మళ్లీ తన పరిశోధనలను కొనసాగించేందుకు అదే దీవికి వెళ్లాడు. ముందురోజు ఎంతో సహనంగా సమాధానం ఇచ్చిన గిరిజనులు ఈ సారి మాత్రం జాన్ను ఈడ్చుకెళ్లారు. బాణాలతో, ఈటలతో పొడిచి చంపారు. ఇదంతా కాస్త దూరంగా ఉండి చూశారు మత్స్యకారులు.
ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిచి దీవికి చేరుకున్న జాన్
హిందూ సముద్రం చివరి దీవికి ఎవరూ వెళ్లరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ మత్స్యకారులు అమెరికా జాతీయుడైన జాన్ను అక్కడికి చేర్చినందుకు గాను ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు. ఆంథ్రాపాలజిస్టులతో జాన్ మృతదేహాన్ని ఎలా తీసుకురావాలనేదానిపై చర్చిస్తున్నారు పోలీసులు. జాన్ అలెన్ చౌను గిరిజనులు బాణాలతో పొడిచి చంపినట్లు తెలుస్తోందని అయితే తను ఎలా మృతి చెందింది మృతదేహాన్ని పరిశీలిస్తే తప్ప నిర్ధారించలేమని అండమాన్ నికోబార్ దీవుల డీజీపీ దీపేంద్ర పటాక్ తెలిపారు.
మత్స్యకారుల తప్పులేదు..వారిని విడిచిపెట్టండి: జాన్ కుటుంబ సభ్యులు
జాన్ అలెన్ చౌను గిరిజనులు చంపేశారన్న సంగతి మత్స్యకారులు తన మిత్రడికి చేరవేశారు. తిరిగి జాన్ కుటుంబ సభ్యులకు ఆ మిత్రుడు సమాచారం అందించాడు. జాన్ మృతి పట్ల తమ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయిందని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అయితే జాన్ అలెన్ ఇష్టప్రకారం మేరకే గిరిజనుల దగ్గరికి వెళ్లాడని ఆయనకు సహకరించిన మత్స్యకారుల తప్పేమీ లేదని వెంటనే వారిని విడుదల చేయాలని కోరారు. జాన్ అలెన్ చౌ అండమాన్కు వెళ్లడం ఇది తొలిసారి కాదు. 2015, 2016లో వెళ్లాడు కానీ.. ఉత్తర సెంటినెల్ ద్వీపానికి మాత్రం తొలిసారి వెళ్లాడు. అక్టోబర్ 16న అండమాన్కు చేరుకున్న జాన్ అలెన్ అక్కడే ఓ హోటల్లో బస చేశారు. తన స్నేహితుడి సహాయంతో ఏడుగురు మత్స్యకారులను 325 అమెరికా డాలర్లు ఇచ్చి తనను ద్వీపానికి చేరవేయాల్సిందిగా పెట్టుకున్నాడు.