చైనాకు మరో షాకివ్వనున్న కేంద్రం- త్వరలో బ్లాక్ లిస్ట్లోకి డ్రాగన్ టెలికాం సంస్ధలు
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం ఇప్పుడు టెలికాం పరికరాల దిగుమతిని పూర్తిగా నిలిపివేసే దిశగా అడుగులేస్తోంది. త్వరలో చైనాకు చెందిన టెలికాం పరికరాల సంస్ధలను బ్లాక్ లిస్ట్లో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.
Recommended Video
త్వరలో కొన్ని విదేశీ టెలికాం పరికరాల సంస్ధలను బ్లాక్ లిస్ట్లో చేర్చనున్నట్లు కేంద్రం ఇవాళ వెల్లడించింది. అదే సమయంలో భారత్కు నమ్మకమైన టెలికాం పరికరాల కొనుగోలు సంస్ధల జాబితాను కూడా ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ఆయా సంస్ధల నుంచే భారతీయ సంస్ధలు టెలికాం పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టెలికాం రంగం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
జాతీయ టెలికాం రంగం భద్రత దృష్ట్యా కేబినెట్ కమిటీ తాజాగా సూచనలు జారీ చేసిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ప్రకారం నమ్మకమైన సప్లై చైన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ప్రకారమే నమ్మకమైన విక్రయదారుల జాబితా త్వరలో విడుదల చేస్తామన్నారు. అయితే చైనా సంస్ధలను బ్లాక్ లిస్ట్లో చేరుస్తారా అన్న ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే చైనాతో ఉద్రిక్తతల దృష్ట్యా ఆ దేశానికి సంబంధించిన సంస్ధలనే బ్లాక్ లిస్ట్లో చేర్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.