22న తేలనున్న పుదుచ్చేరి కాంగ్రెస్ సర్కారు భవితవ్యం: బలపరీక్షకు ఎల్జీ తమిళిసై ఆదేశం
పాండిచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకున్న ఒకరోజు వ్యవధిలోనే తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మైనార్టీలో ఉన్న పుదుచ్చేరి కాంగ్రెస్ సర్కారుకు షాకిచ్చేలా ఆ నిర్ణయం ఉండటం గమనార్హం.
అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వానికి బలం నిరూపించుకోవాలని స్పష్టం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై. ఇందుకోసం సోమవారం (ఫిబ్రవరి 22) సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణకు ఆదేశించారు. ఇక ఆ రోజు పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే సర్కారు భవిష్యత్ తేలిపోనుంది.
పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలుండగా 30 స్థానాలుండగా, కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కూడిన 18 మంది సభ్యుల బలంతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోమ, మంగళవారాల్లో ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ కూడా రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.
అంతేగాక, గతంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ధనవేలుపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంతో ఆయన ఓటు కూడా చెల్లకుండా పోయింది. ప్రస్తుతం స్పీకర్తో కలిపి కాంగ్రెస్ పార్టీకి 10 మంది సభ్యుల బలం ఉండగా, డీఎంకేకు చెందిన ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, బీజేపీ 3(నామినేటెడ్)తో కలిపి, వీరంతా కూడా 14మంది సభ్యులే కావడం గమనార్హం.
అయితే, అధికారం చేపట్టాలంటే 15 మంది సభ్యుల బలం ఉండాలి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బలపరీక్ష ఉత్కంఠగా మారింది. ఎవరూ సరైన బలం నిరూపించుకోకపోతే గవర్నర్ పాలనలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీనే తమ ప్రభుత్వంపై కుట్ర పన్ని ఈ విధంగా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.