మరికొద్ది గంటల్లో పార్లమెంటు సమావేశాలు: నిలదీసేందుకు విపక్షాలు రెడీ, ప్రభుత్వం కూడా
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రతిపక్షాలను ధీటుగా ఎదర్కొనేందుకు అధికార పక్షం కూడా సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు చాలా సమస్యలున్నాయని అంటున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తలు, వాస్తవాధీన రేఖ అంశాలు, కరోనా సంక్షోభంపైనా చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ నిధులపై పారదర్శకంగా ఉండాలన్నారు జైరాం రమేష్. సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా పీఎం కేర్స్కు చైనా కంపెనీలు నిధులు ఎలా ఇస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
సరిహద్దులో పరిస్థితిపై పార్లమెంటులో చర్చించాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. 1962 చైనాతో యుద్ధం సమయంలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా సమాధానమిచ్చారని తెలిపారు. ఈ అంశంపై దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపే కూడా ప్రశ్నించారని గుర్తు చేశారు.
COVID, India-China are face to face in Ladakh & there is tension, GDP has tumbled, inflation, New Education Policy - there are multiple issues before the House that the citizens of this country would want to hear about & Parliamentarians would like to discuss: Ghulam Nabi Azad https://t.co/LTUJlKM4qS
— ANI (@ANI) September 13, 2020
కరోనా, భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, జీడీపీ క్షీణత, ద్రవ్యోల్బణం, నూతన విద్యా విధానం లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. వీటన్నింటిపై చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు.
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ చరిత్రలో తొలిసారి పలు ప్రదేశాల నుంచి రియల్ టైమ్లో ఉభయసభలు సమావేశం కానున్నాయి. సమావేశాల తొలిరోజు ఉదయం లోక్సభ, మధ్యాహ్నం రాజ్యసభ జరగునన్నాయి. ఇక 15 నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు సభ్యులూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఐదుగురు సభ్యులకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వారు సభకు హాజరుకాలేరు.