కరోనా ఎఫెక్ట్ : కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు.. వాటి ధరలు 16 రెట్లు పెంపు..
కరోనా వైరస్ ఎఫెక్ట్తో మాస్కులు,హ్యాండ్ వాష్ శానిటైజర్స్కు డిమాండ్ పెరిగింది. జనం వీటి కొనుగోలుకు ఎగబడుతుండటంతో ఇదే అదనుగా కొన్ని సంస్థలు దోపిడీకి తెరలేపాయి. ఇప్పటికే రూ.2 విలువ చేసే మాస్కులను రూ.10 వరకు అమ్ముతూ పలు మెడికల్ షాపులు సామాన్యులను దోచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో హ్యాండ్ వాష్ శానిటైజర్స్ ధరలు అమాంతం 16 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వాటిని ఆర్డర్ చేయాలనుకున్నవినియోగదారులు ఆ ధరలు చూసి కంగు తింటున్నారు.
Recommended Video
హ్యాండ్ శానిటైజర్స్కు డిమాండ్
కరోనా వైరస్ భయం చాలా దేశాల్లో లేనిపోని అపోహలను సృష్టించింది. కరోనా వ్యాప్తి ఒక్కసారిగా విజృంభిస్తే.. బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుందో లేదో.. ఒకవేళ వెళ్లినా ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో చాలామంది కిరాణ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే టాయిలెట్ పేపర్ కట్టల కోసం ఎగబడుతున్న పరిస్థితి. ఎక్కడ అయిపోతాయోనన్న ఆందోళనతో ముందస్తుగా భారీ సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారత్లో హ్యాండ్ శానిటైజర్స్కు డిమాండ్ ఏర్పడింది.
30ఎంల్ బాటిల్ రూ.999
ఫ్లిప్కార్టులో హిమాలయా ప్యూర్ హ్యాండ్స్ 30ఎంఎల్ బాటిల్ విలువ రూ.999గా ఉంది. సాధారణ రేటు కంటే ఇది ఎన్నో రేట్లు అధికం. దీంతో కంగు తిన్న వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. అయితే ఫ్లిప్ కార్ట్ హెల్స్ సెంటర్ మాత్రం.. అదే బాటిల్ను ఇతర విక్రేతలు వివిధ రేట్లలో అందిస్తున్నారని తెలిపింది. ఇక హిమాలయ డ్రగ్ కంపెనీ.. తమ సంస్థ హ్యాండ్ శానిటైజర్ ధరలను పెంచలేదని స్పష్టం చేసింది. ధర్ట్ పార్టీ సెల్లర్స్ ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
చర్యలు తీసుకోవాలంటున్న కస్టమర్స్
'ఆయా కంపెనీలు వాస్తవానికి 30 మి.లీ హ్యాండ్ శానిటైజర్ను కేవలం రూ.999 లకే ప్రజలకు విక్రయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అది కూడా రూ.1 తగ్గింపుతో.' అంటూ ఓ నెటిజెన్ ట్విట్టర్లో సెటైర్స్ వేశారు. ఇలాంటి తరుణంలో అధిక ధరలకు హ్యాండ్ శానిటైజర్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా,భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరిన సంగతి తెలిసిందే. కొత్తగా కేరళలో 5,తమిళనాడులో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.