రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై దాడుల చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది.
అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో రైతులు, పోలీసులు పరస్పరం గులాబీ పూలు ఇచ్చుకోవడం గమనార్హం. అంతేగాక, కలిసి భోజనాలు కూడా చేశారు. కాగా, ఎర్రకోట వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకుని జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత స్వల్ప లాఠీఛార్జీ చేసి పోలీసులు రైతులను అక్కడ్నుంచి పంపించివేశారు.
కాగా, దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులపై పలువురు రైతులు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు రైతులపై లాఠీ ఛార్జీ చేశారు. పలు ప్రాంతాల్లో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ట్రాక్టర్ ర్యాలీ కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ జెండాలతో ప్రశాంతంగా తమ ర్యాలీ చేసుకుంటామని రైతు సంఘాల నేతలు చెప్పినప్పటికీ.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, తమ ర్యాలీలో రాజకీయ పార్టీలకు చెందిన పలువురు చేరి ఈ దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని రైతు నేతలు చెబుతున్నారు.
రైతులు ఎవ్వరూ కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని సూచించారు. ర్యాలీ ముగిసిన వెంటనే తిరుగుపయనం కావాలని స్పష్టం చేశారు. ర్యాలీకి ఇచ్చిన గడువు మించిపోవడంతో పోలీసులు కూడా ఢిల్లీ నుంచి రైతులను పంపించేస్తున్నారు. ప్రస్తుతం రైతులంతా తమ ట్రాక్టర్లతో దేశ రాజధానిని విడిచివెళుతున్నారు.