ఇండో పాక్ ఎఫెక్ట్: కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటన
ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం విమానాయాన రంగంపై పడుతోంది. నిన్న పలు విమానాశ్రాయాలు మూసివేస్తున్నట్లు ఇరు దేశాలు తొలుత ప్రకటించాయి. ఆ తర్వాత కాసేపటికి విమానాశ్రయాలు తిరిగి తెరుచుకుని తమ కార్యకలాపాలు సాగించాయి. ఇక పాకిస్తాన్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాక్ గగనతలంలో విమానాలు ఎగిరేందుకు ఇంకా మార్గం సుగుమం కాలేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ గగనతలంపై వెళుతున్న పలు విమానాలు దారి మళ్లించడం జరిగింది. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విమానాశ్రయాల్లోనే ఇరుక్కుపోయారు.
#9Wupdate
— Jet Airways (@jetairways) February 28, 2019
We request our guests to check their flight status prior to leaving for the airport: https://t.co/aT3wpZexyr pic.twitter.com/aiNbVTOXHw
తాజాగా ప్రముఖ విమానాయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ విమానాల్లో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు ముందుగా స్టేటస్ చూసుకుని బయలు దేరాలని ఆ ప్రకటనలో తెలిపింది. కొన్ని విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉన్నందున ఆ విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. కేవలం తమ సంస్థ భద్రత గురించి ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటనలో పేర్కొంది. విమానాలను దారి మళ్లించినందున గమ్యస్థానం చేరుకోవడంలో ఇంకాస్త సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే ధాయ్లాండ్ విమానాయాన సంస్థలు భారత్ పాక్ మీదుగా యూరప్ దేశాలకు వెళ్లాల్సిన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటనలో వెల్లడించింది. గురువారం సాయంత్రం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని థాయ్ విమానాయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు సింగపూర్ ఎయిర్ లైన్స్ బ్రిటీష్ ఎయిర్ వేస్ తమ విమానాలను దారి మళ్లించాయి.