ఒక్కచోట చేరిన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులు... బీహార్లో ఇంట్రెస్టింగ్ సీన్...
ఇటీవల కన్నుమూసిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్మారకార్థం మంగళవారం (అక్టోబర్ 20) సాయంత్రం పాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమం ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులను ఒకేచోట చేర్చింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్,లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్.. కార్యక్రమంలో ఈ ముగ్గురు పక్కపక్కనే కూర్చొన్నారు. ఎన్నికల ర్యాలీల్లో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న వేళ... రాజకీయ విబేధాలన్నింటినీ పక్కనపెట్టి ముగ్గురూ ఒకేచోట చేరడం ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ అటు చిరాగ్ పాశ్వాన్తో,ఇటు తేజస్వి యాదవ్తో.. ఇద్దరితోనూ కొద్దిపాటి సంభాషణ జరిపినట్లు చెబుతున్నారు. చిరాగ్ పాశ్వాన్ నితీశ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఎల్జేపీ పార్టీ నేతలు తెలిపారు.ఈ ముగ్గురు సోఫాలో పక్కపక్కనే కూర్చొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాశ్వాన్ సతీమణి రీనా పాశ్వాన్తోనూ నితీశ్ కాసేపు ముచ్చటించారు.
కాగా,తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో నితీశ్ కనీసం ఫోన్ ద్వారా కూడా పరామర్శించలేదంటూ ఇటీవల చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు,రాజ్యసభ ఎన్నికల సమయంలో తన తండ్రిని నితీశ్ ఘోరంగా అవమానించారని ఆరోపించారు. తన తండ్రి భౌతిక కాయాన్ని ఢిల్లీ నుండి పాట్నాకు తరలించే సమయంలో విమానాశ్రయంలో ఉన్న నితీష్ కనీసం ఆయనకు నివాళి అర్పించలేదని ఆరోపించారు. తాను నితీశ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేసినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన చిరాగ్... జేడీయూకి వ్యతిరేకంగా అభ్యర్థులను కూడా నిలిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు గతంలో మహాకూటమి సంకీర్ణ సర్కార్ విచ్చిన్నానికి కారకుడైన నితీశ్ను ఈసారి ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో తేజస్వి యాదవ్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నితీశ్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది జరగలేదని,తీవ్ర నిరుద్యోగ సమస్య నెలకొందని ఎన్నికల ర్యాలీల్లో తేజస్వి ప్రచారం చేస్తున్నారు. మహాకూటమిని గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే అన్ని ఉద్యోగాలకు జీతాలిచ్చేందుకు అసలు డబ్బులు ఎక్కడినుంచి తీసుకొచ్చారు... దొంగ నోట్లు ముద్రిస్తారా లేక జైల్లో నుంచి తీసుకొస్తారా అని నితీశ్ తాజాగా విమర్శించారు. ఆర్జేడీ అధినేత ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో అంత డబ్బును జైల్లో నుంచి తీసుకొస్తారా అంటూ నితీశ్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈసారి బీహార్ వార్ మరింత రసవత్తరంగా సాగుతోంది. అంతిమంగా ఎన్నికల బరిలో విజేతలెవరో తెలియాలంటే నవంబర్ 10 వరకు ఆగాల్సిందే.