వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం
న్యూఢిల్లీ: వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ బిల్లులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన అకాలీదళ్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో అటు పంజాబ్ రాష్ట్రంలోనూ.. ఇటు కేంద్రంలోనూ ఈ రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి.
రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆ బిల్లులను తాము సమర్థించలేమని అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు 2020, ది ఫార్మార్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యురెన్స్ అండ్ ఫాం సర్వీసెస్ బిల్లు 2020 అండ్ ది ఎషెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్లు 2020లను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టగా, ఆమోదం పొందాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపంగా మారాయి.
కాగా, సెప్టెంబర్ 25న దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల రైతు సంఘాలు, విపక్ష పార్టీల నాయకులు, కార్యర్తలు రోడ్లపైకి వచ్చి ఈ బిల్లులకు నిరసన తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ నిరసనలు ఎక్కువగా జరిగాయి. రోడ్లు, రైల్వే ట్రాక్స్ వద్ద ఆందోళనలు నిర్వహించారు.
ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు 70ఏళ్లలో ఎలాంటి మేలూ జరగలేదని, తొలిసారి రైతులకు ప్రయోజనం కలిగే బిల్లులను తెస్తే వ్యతిరేకిస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ బిల్లులు రైతుల జీవనస్తాయిని మెరుగుపరుస్తాయని అన్నారు. కాగా, ఇటీవల పంటల మద్దతు ధరను కూడా కేంద్రం పెంచింది. రైతుల పంటలకు మద్దతు ధరను పెంచడంలో ఎన్డీఏదే రికార్డు ప్రభుత్వం స్పష్టం చేసింది.