ఆరు రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసేందుకు ఆరు పంటలపై మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
గోధుమపై కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 50 పెంచింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం వెల్లడించారు. మొత్తం ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచినట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే గోధుమపై ఎంఎస్పీ(కనీస మద్దతు ధర )క్వింటాలుకు రూ. 50 పెంచుతూ.. ధరను రూ. 1975గా నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఇక శనగపై రూ. 250, మసూర్ పప్పుపై రూ. 300, ఆవాలపై రూ. 225లు క్వింటాలుకు ఎంఎస్పీ పెంచేదుకు కమిటీ ఆమోదించిందని తెలిపారు.
ఎంఎస్పీ, మార్కెట్ కమిటీ వ్యవస్థలను ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుందన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
విపక్షాల ఆందోళనల మధ్యే రైతులు తమ ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకోవడం, వ్యాపారులతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి మూడు బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా, బిల్లులకు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమయ్యాయి విపక్షాలు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కేంద్రం పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.