కొత్త పొత్తు పొడిచేనా?: దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే భేటీ
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో మంగళవారం భేటీ అయ్యారు. ఎంఎన్ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకుటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫడ్నవీస్తో రాజ్ థాక్రే భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీతో పొత్తు కోసమే..
బీజేపీతో తన సోదరుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో పొత్తు విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్తో రాజ్ థాక్రే ఈ భేటీలో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఎంఎన్ఎస్ తమ పార్టీ జెండాను కూడా కాషాయం, నీలం, ఆకు పచ్చ రంగు నుంచి ఒక్క కాషాయం రంగులోకి మార్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
స్వరం మారింది.. పునరాలోచనలో..
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాజ్ థాక్రే. ఆ తర్వాత స్వరం మార్చారు. నిన్న మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని రాజ్ థాక్రే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజ్ థాక్రే పునరాలోచనలో పడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒక్క స్థానంలోనే..
100 స్థానాలకు పైగా పోటీ చేసినా ఒకే ఒక్క స్థానం నుంచి ఎంఎన్ఎస్ విజయం సాధించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 13 సీట్లను కైవసం చేసుకుంది. గత ఐదేళ్లలో తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఎంఎన్ఎస్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడంలో తీవ్రంగా విఫలమవుతోంది.
మహారాష్ట్రలో కొత్త పొత్తు..
బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత శివసేన హిందుత్వానికి దూరమైందనే ప్రచారం జరుగుతోంది. దీంతో హిందూ భావం జాలం కలిగిన బీజేపీతో కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందని ఎంఎన్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014 ముందుకు వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలికిన రాజ్ థాక్రే.. ఆ తర్వాత ఆయన పట్ల ప్రతికూలంగా మారి దూరమయ్యారు. తాజాగా ఫడ్నవీస్తో భేటీతో మహారాష్ట్రలో మరో కొత్త పొత్తు పొడుస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే పలు బీజేపీ పోస్టర్లు, ఫ్లెక్సీల్లో రాజ్ థాక్రే ఫొటో కూడా దర్శనమిస్తుండటం గమనార్హం.