ప్లీజ్ మొబైల్ టవర్లకు విద్యుత్ నిలిపేయొద్దు: రైతులకు పంజాబ్ సీఎం విజ్ఞప్తి, ఎందుకంటే..?
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలో కొందరు రైతులు మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో ప్రజలు మొబైల్ సిగ్నల్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులెవరూ కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించవద్దని, మొబైల్ టవర్లకు విద్యుత్ ను ఆపవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు.
అసలే కరోనా కష్టాల్లో ఉంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు మొబైల్ సేవలు అందకుంటే మరింత సమస్య ఎదురవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులు కొంత క్రమశిక్షణతో మెలగాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగే పనులు చేయొద్దని అమరీందర్ సింగ్ కోరారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు మద్దతుగా పలువురు రైతులు మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం లాంటి పనులు చేస్తున్న విషయం తెలిసిందే.
మొబైల్ సేవలకు ఆటంకాలు కలిగించడం, మొబైల్ సర్వీసులు అందిస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం లాంటి చర్యలను పంజాబ్ ఇష్టపడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నూతన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి మద్దతు తెలుపుదామని అన్నారు. అయితే, రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మాత్రం వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.
విద్యార్తులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొందరు రైతులు ఇప్పటికే మొబైల్ టవర్లకు ముఖ్యంగా జియో టవర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో సిగ్నల్స్లో అంతరాయం కలిగి ఆన్లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేగాక, కరోనా కారణంగా ఇంటి నుంచే పనులు చేస్తున్న ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వానికి ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ మేరకు స్పందించారు.
సీఎం అమరీందర్ సింగ్ ఆందోళన..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ చర్యలు ప్రభావం చూపుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు టెలికాం సంస్థలు కూడా ప్రభుత్వాన్ని మొబైల్ సేవలకు అంతరాయం కలిగించకుండా చూడాలని విన్నవించాయి. కాగా, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నెల రోజులకుపైగా ఢిల్లీ సరిహద్దులోని జాతీయ రహదారులపై పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు.
రైతులకు మేలు చేసే చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా ఇప్పటికే సుమారు 4 వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.