అసహనమా? ప్రశ్నే లేదు: కొట్టిపారేసిన అద్వానీ
న్యూఢిల్లీ: దేశంలో అసహనం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై భారతీయ జనతా పార్టీ అగ్ర నేత ఎల్కె అద్వానీ స్పందించారు. దేశంలో అసహనం అనే మాటే లేదని, భావ ప్రకటనా స్వేచ్ఛకు వచ్చిన విఘాతం ఏమీ లేదని స్పష్టం చేశారు. మాట్లాడే స్వేచ్ఛ లేదని ఎవరంటున్నారో తనకు తెలియదని, అదంతా కల్పిత ప్రచారమేనని అన్నారు.
67వ గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జెండా ఎగురవేసిన అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడారు. మువ్వన్నెల పతాకం రెపరెపలాడే రోజున జాతి జనుల్లో జాతీయభావం పెల్లుబికటం సహజమేనని, అయితే జాతీయ పండుగలనాడేకాక అనునిత్యం పౌరులందరూ ఆ భావనను కలిగిఉండేలా ప్రోత్సహించాలన్నారు.
'ప్రస్తుతం పౌరుల్లో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశభక్తి పెల్లుబికటం సహజమే. అయితే ఆ భావనను మిగతా రోజుల్లోనూ కలిగిఉండాలి. కేవలం కేవలం విద్యా, క్రీడల ద్వారానేకాక ఇతర అన్ని రంగాల ద్వారా ప్రజల్లో జాతీయతా భావాన్ని ద్విగుణీకృతం చేయాలి' అని అద్వానీ అన్నారు.
ఎన్డీఏ హయాంలో భావస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందన్న ఆరోపణలపై స్పందిస్తూ 'బ్రిటిష్ వారితో పోరాడిమరీ మనం స్వేచ్ఛను సాధించాం. ఒకవేళ మా ప్రభుత్వమే గనుక స్వేచ్ఛను హరించేప్రయత్నాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా పోరాడతారు. అయినా ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛకొచ్చిన ప్రమాదమేదీ లేదు. ఏదో జరిగిపోతోందనేది కల్పిత ప్రచారమే కానీ నిజంకాదు' అని అద్వానీ స్పష్టం చేశారు.
గత ఆదివారం పార్టీ చీఫ్ అమిత్ షా తనను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, కేవలం ఆశీర్వచనాలు తీసుకునేందుకు షా తన ఇంటికి వచ్చారని అద్వానీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నజ్మా హెఫ్తుల్లా, రాజీవ్ ప్రతాప్ రూడీ, తదితరులు అద్వానీ నివాసంలో జరిగిన గణతంత్ర్యవేడుకలకు హాజరయ్యారు.