ఐదుగురు భారతీయుల కిడ్నాప్: చైనా పీఎల్ఏకి భారత ఆర్మీ హాట్లైన్ మెసేజ్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని చైనా బలగాలు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. భారతీయుల కిడ్నాప్ విషయంపై ఇప్పటికే ఇండియన్ ఆర్మీ.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి హాట్లైన్ మెసేజ్ పంపినట్లు కేంద్రమంత్రి తెలిపారు. చైనా స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Recommended Video
అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని భారత్-చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన ఐదుగురు అరుణాచల్ప్రదేశ్ వాసులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరో ఇద్దరు చైనా ఆర్మీ నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
టోక్ సింగ్కమ్, ప్రసత్ రింగ్లింగ్, డొంగ్తు ఈబియా, తను బెకర్, నరు దరి అనే ఐదురిని చైనా బలగాలు కిడ్నాప్ చేశాయని తెలిపారు. వీరంతా టగిన్ కమ్యూనిటీకి చెందినవారు. జిల్లా కేంద్రం దపోరిజోలో ఉండే బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తమవారి కిడ్నాప్ విషయమై భారత ఆర్మీతో చర్చించేందుకు తమ బంధువులు వెళ్లారని తెలిపారు. నాచో జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
The Indian Army has already sent hotline message to the counterpart PLA establishment at the border point in Arunachal Pradesh. Response is awaited. https://t.co/eo6G9ZwPQ9
— Kiren Rijiju (@KirenRijiju) September 6, 2020
పాసిఘాట్ వెస్ట్ ఎమ్మెల్యే నినంగ్ ఇరింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు చైనా ఆర్మీపై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చైనా బలగాలకు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. గత మార్చి నెలలో 21ఏళ్ల యువకుడ్ని చైనా పీఎల్ఏ కిడ్నాప్ చేసిందని చెప్పారు. 19 రోజుల తర్వాత అతడ్ని విడిచిపెట్టింది చైనా సైన్యం. సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటంతో మరింత ఘర్షణ వాతావరణానికి తెరతీస్తోంది డ్రాగన్ దేశం.