చైనా, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ - తేజస్ స్క్వాడ్రన్ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?
గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో మోహరింపులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం.. వాటిని పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా తేలికపాటి యుద్ధవిమానం తేజస్తో పాటు మరిన్ని ఎయిర్క్రాఫ్ట్లను పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు వాయిసేన పంపింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు వీటిని సిద్ధం చేస్తున్నట్లు వాయుసేన వర్గాలు ప్రకటించాయి.
ఉద్రిక్తంగానే సరిహద్దులు...
పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నప్పటికీ భారత సరిహద్దుల్లో పొరుగుదేశాల కుట్రలు మాత్రం నిరాటంకంగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా గల్వాన్ లోయ ఘటన తర్వాత చర్చలతో వెనక్కి తగ్గినట్లు నటించి దొంగ దెబ్బ తీసిన చైనా ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. సరిహద్దుల నుంచి వెనక్కి తగ్గేందుకు డ్రాగన్ దళాలు అస్సలు ఇష్టపడటం లేదు. దీంతో భారత్ కూడా వారితో సమానంగా మోహరింపులు పెంచాలని భావిస్తోంది. అదే సమయంలో చైనా మిత్రదేశం పాకిస్తాన్ నుంచి కూడా కవ్వింపులు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అవసరమైతే సరిహద్దుల్లో మోహరింపులు మరింత పెంచేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు..
రంగంలోకి తేజస్, ఇతర ఎయిర్క్రాఫ్ట్లు...
స్వదేశీ పరిజ్ఢానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ఎల్సీఏ స్క్వాడ్రన్ తేజస్, 45 స్క్వాడ్రన్ ఫ్లయింగ్ డ్రాగర్లు ఇతర ఎయిర్క్రాఫ్ట్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట మోహరిస్తున్నారు. పగలూ, రాత్రీ యుద్ధ విమానాలక రాకపోకలతో సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఫార్వార్డ్ ఎయిర్ బేస్లకు యుద్ధ విమానాల రాక పెరిగింది. సరిహద్దుల్లో చైనా, పాక్ రెండు దేశాల బలగాలు ఏ క్షణాన్నైనా కవ్వింపు చర్యలకు దిగడం లేదా దాడులు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న వాయుసేన తేజస్తో పాటు మిగతా ఎయిర్క్రాఫ్ట్లనూ అక్కడికి పంపుతోంది. తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ ముష్కరులను భారత బలగాలు హతమార్చాయి.
త్వరలో మరిన్ని విమానాల కొనుగోళ్లు...
ప్రస్తుతం దేశీయంగా అభివృద్ది చేసిన యుద్ధ విమానాలతో పాటు మిగ్, రాఫెల్ జెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వాయుసేనను మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది చివరి లోగా 83 మార్క్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో వీటి కొనుగోలు పూర్తవుతుందని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ కూడా ప్రకటించారు. దీంతో సాధ్యమైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయడం ద్వారా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను పెంచాలని కేంద్రం భావిస్తోంది..