చిన్నారి ఏం పాపం చేశాడు: సొంత కొడుకును ఉరి తీశాడు..వీడియో రికార్డ్ చేసిన కూతరు
బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన సొంత కొడుకునే ఉరితీసిన ఘటన వెలుగు చూసింది. హెచ్ఏఎల్ సమీపంలోని విభూతినగర్లో ఈ ఘటన జరిగింది. సురేష్ బాబు అనే 43 ఏళ్ల సేల్స్ ఎగ్జిక్యూటివ్ 12 ఏళ్ల తన కుమారుడిని ఫ్యాన్కు ఉరివేశాడు. అనంతరం తన భార్యను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా బలవంతం పెట్టాడు. దీన్నంతటినీ సురేష్ కూతురు మొబైల్ ఫోన్లో రికార్డు చేసింది.
సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నం
సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న సురేష్ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీవ్రతరం అయ్యాయి. వీటిని ఎదుర్కొనలేకనే ఆత్మహత్య చేసుకోవాలని కుటుంబం భావించిందని పోలీసులు తెలిపారు. చిట్ఫండ్ వ్యాపారం పెట్టి అందులో నష్టాలను చవిచూసినట్లు పోలీసులు చెప్పారు. ఇక ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన సురేష్ కుటుంబం కొందరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి వడ్డీకి డబ్బులు తీసుకున్నారని అయితే సకాలంలో వారు దాన్ని చెల్లించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పుల వారు వేధిస్తుండటంతో ఇక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని పోలీసులు వివరించారు.
తమ్ముడిని వదిలేయాలంటూ బతిమలాడిన అక్క
ఇక 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో తన కొడుకు వరుణ్ను సురేష్ బలవంతంగా సీలింగ్ ఫ్యాన్కు ఉరివేస్తున్నట్లుగా కనిపించింది. వరుణ్ గిలగిల కొట్టుకుంటుండగా భార్య గీతా, కూతురు ఆ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆసమయంలో తన తమ్ముడిని వదిలేసి అందరం చనిపోదాం అని సురేష్ కూతురు బిగ్గరగా ఏడవటం వీడియోలో రికార్డు అయ్యింది. ఇక కూతురు రికార్డు చేస్తున్న వీడియోను గమనించిన గీతా వెంటనే ఫోనును తన చేతిలోనుంచి లాక్కొంది. దీంతో వీడియో అక్కడి వరకే రికార్డు అయ్యింది. ఆ తర్వాత గీతా కూడా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
కొడుకును భార్య చంపి ఆత్మహత్య చేసుకుందంటూ బుకాయింపు
ప్రాణాలతో బయటపడ్డ సురేష్.. తాను ఆత్మహత్యకు పాల్పడుతుండగా తన కూతురు వద్దని వారించిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. ముందుగా తన కొడుకును చంపింది తన భార్య గీతా అని ఆ తర్వాత ఆమె కూడా మృతి చెందిందని సురేష్ పోలీసులకు చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో మొబైల్ ఫోను దొరకడం అందులో రికార్డు అయిన వీడియో బయటపడటంతో అసలు సంగతి వెలుగు చూసింది. సురేష్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.