కర్ణాటకకు కాశ్మీర్ దెబ్బ: మూడు జాబితాలు, ఢిల్లీ పిలుపు కోసం, యడియూరప్ప ఏక్ నిరంజన్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 10 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన ఏకచత్రాధిపత్యం ఇంకా కొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ దెబ్బ కర్ణాటక మీద పడటంతో బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తోంది. అమిత్ షా నుంచి పిలుపురాకపోవడంతో కర్ణాటక బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.
కర్ణాటకకు కాశ్మీర్ దెబ్బ
యడియూరప్ప తన మంత్రి వర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటున్నారు ? ఎవరెవరికి ఏ ఖాతాలు కేటాయిస్తున్నారు ? అనే విషయం ఇంత వరకు బయటకురాలేదు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చెయ్యడంతో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీరికలేకుండా గడుపుతున్నారు. అమిత్ షా నుంచి కర్ణాటక బీజేపీ నేతలకు ఇంత వరకు పిలుపు రాకపోవడంతో యడియూరప్ప తన మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ముగ్గురి చేతిలో మూడు జాబితాలు
కర్ణాటక మంత్రివర్గంలో ఎవరికి చాన్స్ ఇవ్వాలి అనే విషయంలో ఇప్పటి వరకు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇప్పటికే ఓ జాబితా హైకమాండ్ కు పంపించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. శంకర్ ఓ జాబితాను హైకమాండ్ కు పంపించారు. ఇక అమిత్ షా ఆయన ప్రత్యేక టీంతో ఓ జాబితాను తయారు చేయించుకున్నారు. ఎవరి జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి ? అనే విషయం మాత్రం బయటకురాలేదు.
రెండు జాబితాల్లో ఆ పేర్లు !
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్. శంకర్ తయారు చేసిన వేర్వేరు జాబితాల్లో (రెండు జాబితాలు) దాదాపుగా కొందరు సీనియర్ నాయకుల పేర్లు ఉన్నాయని సమాచారం. జమ్మూ కాశ్మీర్ వివాదం సద్దుమనిగిన తరువాత కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటుకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలిసింది.
నరేంద్ర మోడీ, అమిత్ షా
జులై 26వ తేదీ బీఎస్. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి తన మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మనవి చెయ్యడానికి యడియూరప్ప వేచి చూస్తున్నారు. ఆగస్టు 5వ తేదీ అమిత్ షాతో యడియూరప్ప భేటీ కావలసి ఉంది. అయితే కాశ్మీర్ విషయంలో అమిత్ షా బిజీ కావడంతో వారి భేటీ తాత్కాలికంగా వాయిదా పడింది.
సీనియర్లకు భలే చాన్స్
ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రి వర్గంలో సీనియర్ ఎమ్మెల్యేలకు చాన్స్ ఉందని సమాచారం. మంత్రివర్గం జాబితాలో సీనియర్ ఎమ్మెల్యేలు జగదీష్ శెట్టర్, కేఎస్, ఈశ్వరప్ప, బళ్లారి శ్రీరాములు, ఆర్. అశోక్, మధుస్వామి, గోవింద జారకిహోళి, వి సోమణ్ణ, అరవింద్ లింబావలి, సీటీ. రవి, సురేష్ కుమార్, ఉమేష్ కత్తి, బాలచంద్ర జారకిహోళి, హాలాడి శ్రీనివాస్, కేజే, బోపయ్య, అశ్వథ్ నారాయణ, రేణుకాచార్య పేర్లు మొదటి వరసలో ఉన్నాయి.