అందుకే షా అంటే మోడీకి గురి: ఎంట్రీతో అదుర్స్..ప్రతిపక్షాలు బెదుర్స్
ఆయన అపర చాణక్యుడు..స్కెచ్ వేశారంటే అది విజయవంతంగా అమలు కావాల్సిందే. ప్రధాని మోడీకి కుడిభుజంలాంటి వారు. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్పేయికి మాజీ కేంద్రమంత్రి అద్వానీ ఎలా అయితే రైట్ హ్యాండ్గా ఉన్నారో ఇప్పుడు ఉన్న ఆయన కూడా ప్రధాని మోడీకి కొండంత బలం. ఇప్పటికే ఆయనెవరో అర్థమైపోయి ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. ఆయనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్పై అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా... వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసినా... ఎస్పీజీ చట్ట సవరణ చేసిన ఈ ఘనత అమిత్ షాకే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తొలిసారిగా లోక్సభకు అమిత్ షా
అమిత్ షా... కేంద్ర హోంశాఖ మంత్రి. తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. తొలిసారిగా లోక్సభకు ఎన్నికై కీలకమైన కేంద్ర హోంశాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా... పలు కీలక చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపచేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రావడం నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం వెనక షా కీలక పాత్ర పోషించారు. ఇక రెండో సారి ఏకంగా ఆయనే పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఇక అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వెనక అమిత్ షా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారని సమాచారం.
హోంమంత్రిగా కీలక బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా
ఇక బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక కేంద్రహోంశాఖ మంత్రిగా అమిత్ షా కొన్ని కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి విచారణ సందర్భంగా పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టడుతూ తీసుకొచ్చిన బిల్లు, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి చారిత్రాత్మకమనే చెప్పాలి.ఇక శీతాకాల సమావేశాల్లో ఎస్పీజీ చట్టంను ప్రవేశపెట్టారు. ఎస్పీజీ రక్షణ ప్రధాని అతని కుటుంబ సభ్యులకు, మాజీ ప్రధానులకు ఐదేళ్ల పాటు కల్పించడం లాంటి బిల్లును తీసుకొచ్చి పాస్ చేయించడంలో కీలకంగా వ్యవహరించారు షా. మరోవైపు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ అవసరం లేదని తేల్చేశారు.
ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకెళ్లిన షా
ఇక అన్నిటికంటే ఎక్కువగా ప్రభావం చూపింది మాత్రం వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు. ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఆమోదింపచేయడంలో అమిత్ షా సక్సెస్ అయ్యారు. పొరుగు దేశాల్లో మైనార్టీలుగా ఉన్న ఇతర మతస్తులు భారత్లో శరణార్థులుగా వచ్చారు. వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ భారత పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. బిల్లుపై సర్వత్రా విమర్శలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముస్లింలకు భరోసానిస్తూ బిల్లును పాస్ చేయించడంలో అమిత్ షా తన చాణక్యతను ప్రదర్శించారు. రాజ్యసభలో ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్యా బలం లేకున్నప్పటికీ అమిత్ షా తన చతురతను ప్రదర్శించి సక్సెస్ అయ్యారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై ముస్లింలకు భరోసా ఇస్తూ..
అమిత్ షా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనప్పటికీ అది తాను మాత్రమే చేయగలనని మరోసారి నిరూపించారు. ఇక కశ్మీర్ అంశంలో నేతలను గృహనిర్భంధం చేయడంతో అమిత్ షాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెబుతూ దగ్గరగా పర్యవేక్షించారు. అంతర్జాతీయ సమాజం కూడా కశ్మీర్లో కొనసాగిన ఆంక్షలపై గళమెత్తింది. ఇక పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. అయినా షా బిల్లును పాస్ చేయండంలో సక్సెస్ అయ్యారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవంలో రెండు లోట్లను పూడ్చిన షా
గుజరాత్ ప్రభుత్వంలో అమిత్ షా చాలా ఏళ్లుగా మంత్రిగా కొనసాగారు. 2017లో రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు అమిత్ షా. అమిత్ షా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో రెండు అంశాలు మాత్రమే లోటుగా కనిపించేవని బీజేపీ నేతలు చెప్పేవారు. అది కేంద్రంలో విధాన పరమైన నిర్ణయాలు, మరియు పార్లమెంటరీ ప్రాక్టీసు అని చెప్పేవారు. ఇక అమిత్ షా కేంద్రహోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆ రెండు అంశాలకు కూడా పరిపూర్ణత తీసుకొచ్చారని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి ప్రతిష్టాత్మకమైన బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేయించి బీజేపీ చరిత్రలో కొత్త అధ్యాయం అమిత్ షా లిఖించారని కమలనాథులు కొనియాడుతున్నారు.