అమిత్ షా ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన ఎయిమ్స్: బులెటిన్ విడుదల: ఒకట్రెండు రోజుల్లో
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆరోగ్యంపై దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) తాజా అప్డేట్ విడుదల చేసింది. కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన జారీ చేసింది. అనారోగ్యానికి గురి కావడంతో అమిత్ షా శనివారం రాత్రి ఎయిమ్స్లో చేరారు. ఆయన శ్వాసకోశ సంబంధ సమస్యలకు గురయ్యారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎయిమ్స్ చేరారు. ఆయన ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిమ్స్ ఈ ప్రకటన విడుదల చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని అమిత్ షానకు కంప్లీట్ మెడికల్ చెకప్ నిర్వహిస్తున్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు మీడియా అండ్ ప్రొటొకాల్ డివిజన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఆయన కిందటి నెల 30వ తేదీన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారని, రెండు వారాల తరువాత పరీక్షల కోసం మరోసారి ఆసుత్రికి రావాలని తాము ఆ సమయంలోనే సూచించామని అన్నారు. దానికి అనుగుణంగా అమిత్ షా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని ఆర్తీ విజ్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
Recommended Video
కిందటి నెల 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్గా తేలడంతో గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా వైరస్ రిపోర్టులు నెగెటివ్గా రావడంతో అదేనెల 14 తేదీన డిశ్చార్జి అయ్యారు. నాలుగురోజుల తరువాత ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 18వ తేదీన ఎయిమ్స్లో చేరారు. కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ఆరోగ్యం మెరుగు పడటంతో 30వ తేదీన డిశ్చార్జి అయ్యారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పని ఒత్తిడికి గురవుతున్నారు. హఠాత్తుగా శనివారం రాత్రి అమిత్ షా ఆరోగ్యం తిరగబెట్టింది. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.