వరుణ్ గాంధీకి షాక్: రామ్ మాధవ్కు ఎపి బాధ్యత
న్యూఢిల్లీ: వరుణ్ గాంధీకి బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. తన కొత్త జట్టును ఆయన శనివారంనాడు ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు, జెపి నడ్డాకు, రామ్ మాధవ్కు జట్టులో చోటు కల్పించారు.
పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన హర్యానాకు చెందిన జయప్రకాష్ నడ్డాను అమిత్ షా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బిజెపి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన యడ్యూరప్పను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ఆర్ఎస్ఎస్ నుంచి ఇటీవలే బిజెపిలో చేరిన రామ్ మాధవ్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. బీహార్కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీని, తెలంగాణకున చెందిన మురళీధర్ రావును ప్రధాన కార్యదర్సులుగా నియమించారు. ఛత్తీస్గడ్ నుంచి సరోజ్ పాండేను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
రామ్లాల్ యధావిధిగా సంస్థాగత కార్యదర్శిగా తన పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. సయ్యద్ షాహనవాజ్, సుధాంశు త్రివేది, మీనాక్షి లేఖి, ఎంజె అక్భర్, నళిన్ కోహ్లీ, జివిఎల్ నర్సింహారావు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు ఇంతకు ముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న వరుణ్ గాంధీని తప్పించారు.
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ రహత్కర్, పార్టీ యువజన విభాగం చీఫ్గా అనురాగ్ ఠాకూర్ కొనసాగుతారు.
దత్తాత్రేయకు చోటు
అమిత్ షా మొత్తం 11 మంది ఉపాధ్యక్షులను, 8 మంది ప్రధాన కార్యదర్శులను, 14 మంది కార్యదర్శులను, పది మంది అధికార ప్రతినిధులతో మొత్తం 50 మందితో జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.