ఆమె ఆదేశాల మేరకే రథయాత్ర అడ్డుకున్నారు: నిప్పులు చెరిగిన అమిత్ షా
పూణే: పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన రథయాత్ర కేవలం మమతా సర్కారు నుంచి ఆదేశాలు రావడంతోనే రద్దయ్యిదని... అక్కడేదో మతకల్లోలాలు జరుగుతాయని కాదని మండిపడ్డారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. మహారాష్ట్ర పూణేలో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన మమత సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఓ జాతీయ ఛానెల్ ప్రచురించిన స్టింగ్ ఆపరేషన్ ప్రకారం బెంగాల్లో ఎలాంటి మతషర్షణలకు తావులేదని చెప్పారు. కేవలం మమత బెనర్జీ బీజేపీకి భయపడి రథయాత్రను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 7 నుంచి 2019 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని అమిత్ షా భావించారు. అది కూడా బెంగాల్లోని కూచ్ బెహార్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ రథయాత్ర నిషేధమంటూ మమత ఆజ్ఞలు విధించడంతో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అక్కడ కూడా కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు బెంగాల్లో రాజకీయ వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా నిజంగానే ఆరాష్ట్రంలో మతఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందా అనేదానిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే బెంగాల్ శాంతియుతంగానే ఉందని రథయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలగదని స్టింగ్ ఆపరేషన్ ద్వారా తేల్చి చెప్పింది.
మరోవైపు బెంగాల్లో మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. గత ఆదివారం శారదా చిట్ఫండ్ స్కామ్లో విచారణాధికారిగా వ్యవహరించిన ప్రస్తుత కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు సీబీఐ వెళ్లగా అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మమతా బెనర్జీ ప్రవేశించి సీపీ రాజీవ్ కుమార్కు మద్దతుగా నిలిచి కేంద్రంపై యుద్ధం ప్రకటించడంతో బెంగాల్లో రాజకీయ యుద్ధ వాతావరణం నెలకొంది.