ఇది పక్కా.. కేంద్ర కేబినెట్ లోకి అమిత్ షా: హోం లేదంటే రక్షణశాఖ?
వచ్చేనెల 18న గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చేనెల 18న గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు హోం, రక్షణ శాఖలలో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు గుజరాత్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమిత్షాను కేబినెట్లో చేర్చుకోడానికే ప్రధాని మోదీ ఆయనను రాజ్యసభకు తీసుకొస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
ఆయన మంత్రి పదవి చేపడితే పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి రాజస్థాన్కు చెందిన ఓపీ మాథుర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ రేసులో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేనెల 11వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత కొత్త గవర్నర్ల నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తారు.
పారికర్ వెళ్లాక...
మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లాక.. అరుణ్జైట్లీ ఆర్థికశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలను కూడా అదనంగా చేపట్టారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్ తమ శాఖలతో పాటు అదనంగా ఒకటి, రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ముప్పవరపు వెంకయ్యనాయుడును కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కేబినెట్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. బీహార్లో జేడీయూతో కలిసి సంకీర్ణప్రభుత్వం ఏర్పాటుచేయడంతో.. ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరికి మంత్రి కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కేంద్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు అనివార్యమయ్యాయి.
Recommended Video
అమిత్ షాకు ఇలా ప్రాధాన్యం
2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని కేంద్రంలో కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హోం, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి అమిత్షాకు ఇచ్చి.. స్మృతి ఇరానీని సమాచార, ప్రసారశాఖ పూర్తిస్థాయి మంత్రిగానే నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన అమిత్షా తన చతురతతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో, తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు. అందుకే ఇక ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్షంగా తనదైన ముద్ర వేసేందుకు వీలుగానే మంత్రి పదవిని చేపట్టాలనుకుంటున్నారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది.
రాజ్ నాథ్ శాఖ మార్పిడి తప్పదా
పార్టీని 2019 ఎన్నికల కోసం మరింతగా బలోపేతం చేసేందుకు వీలుగా ఆయన్నే పార్టీ అధ్యక్షునిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న వాదనను కూడా మరో వర్గం వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కావాలనుకుంటే అమిత్షా ఎప్పుడైనా కావచ్చని, 2019 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఆ తర్వాత మంత్రివర్గంలో చేరొచ్చని ఆయన సన్నిహితులు కొంతమంది అంటున్నారు. అమిత్షా కేంద్ర మంత్రి అయితే పార్టీ అధ్యక్షపదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై కూడా హస్తినలో అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
క్యాబినెట్ లో చేరడానికి రాం మాధవ్ గతంలో ఇలా
ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తెలుగువాడైన రాంమాధవ్కు ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ బాధ్యతలను అప్పగించారు. అందుకే ఇప్పుడే ఆయనను జాతీయ అధ్యక్షునిగా నియమించకపోవచ్చని, గతంలో మంత్రివర్గంలో చేరాలని ప్రధాని సూచించినప్పుడు కూడా రాంమాధవ్ ఇదే మాటను ఆయనకు చెప్పినట్లు సమాచారం.
జంట పదవులు నిర్వహించే అవకాశాలు
గతంలో రాజ్నాథ్ తర్వాత పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఓపీ మాథుర్, జేపీ నడ్డా పేర్లు తెరపైకి వచ్చినా అమిత్షా అనూహ్యంగా ఆ పదవిని దక్కించుకున్నారు. అప్పుడు గుజరాత్కు చెందిన మోదీ ప్రధాని కాగా, అదే రాష్ట్రానికి చెందిన అమిత్షా పార్టీ అధ్యక్షుడు ఎలా అవుతారని బీజేపీ సీనియర్ నేతలు కొందరు తెరవెనుక సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప.. బహిరంగంగా ప్రశ్నించలేకపోయారు. ఇప్పుడు కూడా ఒక పక్క కేంద్ర మంత్రిపదవిలో ఉంటూనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అమిత్షా చేపట్టినా ప్రశ్నించేవారు ఎవరూ ఉండకపోవచ్చునన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని దక్కేనో
కేంద్రంలో ప్రధాని మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హవా నడిచినంతకాలం చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ ఉండదని, వారు ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుందని వారి అభిప్రాయం. మరి అమిత్షా అధ్యక్ష పదవిని వదులుకొని మంత్రివర్గంలోకి వెళతారా? లేక రెండింటిలోనూ కొనసాగుతారా? అన్న విషయం పార్లమెంటు సమావేశాల తరువాతే తెలుస్తుంది. అమిత్షా అధ్యక్షపదవిని వదులుకుంటే ఆ పదవి ఓపీ మాథుర్, జేపీ నడ్డా, రాంమాధవ్లలో ఎవరో ఒకరిని వరించే అవకాశాలున్నాయి.