వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయం పనులు: అమిత్ షా, తెలంగాణ నేతలకు క్లాస్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం తెలంగాణ బీజేపీ కార్యకర్తల సమావేశంలో అయోధ్య రామాలయం గురించి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే ఇది నిర్ధారణ రావాల్సి ఉంది.
కార్యకర్తలకు షాకిచ్చారు: బేగంపేటలో వేదికపై మాట్లాడకుండానే వెళ్లిన అమిత్ షా
అదే సమయంలో, తెలంగాణ బీజేపీ నేతలకు ఆయన క్లాస్ పీకారు. గతంలో అప్పగించిన పనులను పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు.
కాగా, అంతకుముందు అమిత్ షా ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో వచ్చారు. విమానాశ్రయం ప్రాగణంలో కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఆయనతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పదాధికారులు, బూత్ స్థాయి నేతలు, నియోజవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశమయ్యారు.
ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను ఎదుర్కొని అధికారం కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోడీ పగ్గాలు చేపట్టేలా, తెలంగాణలో ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.