పీవోకే భారతదేశంలో అంతర్భాగమే.. అసదుద్దీన్కు అమిత్ షా కౌంటర్
ఢిల్లీ : లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన అంశాలపై మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చారిత్రక తప్పిదం చేసిందని ఆయన వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అసలు బీజేపీ అలాంటి తప్పు చేయలేదనే విషయం ఆయనకు తొందరలోనే తెలిసి వస్తుందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో జమ్ముకశ్మీర్లో జరిగే అభివృద్ది చూస్తే అసలు విషయం ఆయనకు బోధపడుతుందని వ్యాఖ్యానించారు. లోక్సభలో మాట్లాడిన అమిత్ షా పలు అంశాలను ప్రస్తావించారు.
పీవోకే కూడా భారత్లో అంతర్భాగమే
పీవోకే కూడా భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పుకొచ్చిన అమిత్ షా.. దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసన్నారు. దేశమంతటా ఏ పిల్లోడిని అడిగినా కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెబుతారని గుర్తు చేశారు. 70 ఏళ్లుగా నానుతున్న సమస్యకు పరిష్కారం చూపించామని.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం మంచిదా కాదా అనే విషయం కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టికల్ 370 రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా ప్రధానమంత్రి మోడీని గుర్తు చేసుకుంటారని తెలిపారు.
ఇక సభలో చర్చలు లెవనెత్తకుండానే బిల్లు ఆమోదిస్తున్నారని కొందరు ఆరోపణలు గుప్పించడం సరికాదన్నారు. బీజేపీ చర్చలకు ఎప్పుడు వెనుకడుగు వేయలేదని, వేయబోదని స్పష్టం చేశారు. డెబ్బై సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయని.. అలాంటి క్రమంలో పాకిస్తాన్కు వత్తాసు పలికే వారితో చర్చలు జరపాలా అని సూటిగా ప్రశ్నించారు అమిత్షా.
కశ్మీర్ బిల్లును వ్యతిరేకించే నేతలు దేశద్రోహులే.. లోక్సభలో టీఆర్ఎస్ సంచలన వ్యాఖ్యలు
సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కశ్మీర్ రాష్ట్రం
ప్రధానమంత్రిగా మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు అమిత్ షా. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే జమ్ముకశ్మీర్లో నిషేదాజ్ఞలు విధించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్ ముమ్మాటికీ భారతదేశంలో అంతర్భాగమేనని.. అది కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నాళ్లు ఉంటుందనే సందేహం రావొచ్చు. కానీ అది పెద్ద సమస్య కాదని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రంగా మారుతుందని వివరించారు. అలా అక్కడ నెలకొన్న సమస్యలు క్రమంగా తీరిపోతాయని చెప్పారు.
కశ్మీర్లో మైనార్టీలంటే హిందువులు, జైనులు, సిక్కులని చెప్పిన అమిత్ షా.. ఆర్టికల్ 370 ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. ఆర్టికల్ 370 ద్వారా డెబ్బై సంవత్సరాల నుంచి ఏం ఒరిగిందని ప్రశ్నించారు. అసలు కశ్మీర్ పూర్తిస్థాయిలో నష్టపోవడానికి ఆర్టికల్ 370 కారణమని.. మరి అలాంటప్పుడు అది ఉండటం అవసరమా అన్నారు.
370తో 371ను పోల్చొద్దు.. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు..!
కశ్మీర్ అంశాన్ని అప్పట్లో దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రుయే ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు అమిత్ షా. అదలావుంటే ఆర్టికల్ 370తో 371ను పోల్చడం ఏమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు. అలా ఈ రెండు ఆర్టికల్స్ను పోల్చుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అది మంచి పద్దతి కాదని హితవు పలికారు. అసలు ఆర్టికల్ 371ను ఎత్తివేయాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.