గుజరాత్ అల్లర్ల కేసు.. అహ్మదాబాద్ కోర్టులో అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అమిత్ షా సోమవారం ఉదయం అహ్మదాబాద్ కోర్టులో హాజరయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలైన మాయా కొద్నానీ తరఫున సాక్ష్యం చెప్పడానికి ఆయన కోర్టుకు వచ్చారు.
అహ్మదాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అమిత్ షా సోమవారం ఉదయం అహ్మదాబాద్ కోర్టులో హాజరయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసులో నిందితురాలైన మాయా కొద్నానీ తరఫున సాక్ష్యం చెప్పడానికి ఆయన కోర్టుకు వచ్చారు.
నరోదా గామ్లో 11 మంది ముస్లింల హత్యలు జరిగిన రోజైన ఫిబ్రవరి 28, 2002న మాయా కొద్నానీ అసెంబ్లీలో.. ఆ తర్వాత ఓ సిటీ హాస్పిటల్లో ఉన్నారని అమిత్ షా కోర్టుకు తెలిపారు. ''ఆ సమయంలో మాయా నరోదా గామ్లో లేరు. ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీలో ఉన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 9.45 గంటల మధ్య నేను సిటీ ఆసుపత్రిలో ఉన్నాను. ఆ సమయంలో అక్కడే నేను మాయను కలిశాను..'' అని అమిత్ షా కోర్టుకు స్పష్టంచేశారు.
అమిత్ షా సుమారు గంట పాటు కోర్టులోనే ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా హాజరు కావాలంటూ గత వారమే కోర్టు అమిత్ షాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నరోదా గామ్ మారణకాండకు పాల్పడిన ఆందోళనకారులకు మాయా కొద్నానీయే నేతృత్వం వహించారని ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు తెలిపారు.
ఈ గొడవలు జరిగిన సమయంలో మాయా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 'తాను ఆ సమయంలో అక్కడ లేను అనడానికి.. అమిత్ షానే సాక్ష్యం..' అంటూ మాయా వాదించారు. అయితే తాను షాతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదని చెప్పడంతో కోర్టే ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో అమిత్ షాకు సోమవారం కోర్టుకు హాజరుకాక తప్పలేదు.